నరేంద్ర మోడీ: సమయం వచ్చింది
భారత ఆర్థిక వ్యవస్థ కలల జట్టు - డాక్టర్ మన్మోహన్ సింగ్, డాక్టర్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, పి. చి చిదబరం విషాదకరమైన స్థితిని తెచ్చిపెట్టింది. ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగం పెరుగుదలకు, రూపాయి విలువ పడిపోయే స్థితికి ఈ జట్టు గత పదేళ్లలో దేశాన్ని నడిపించింది. గత పదేళ్ల యుపిఎ ప్రభుత్వం ఆర్థిక వినాశనాన్ని తెచ్చి పెట్టింది. నాయకత్వ లోపం, అధికారయంత్రాంగం పనిచేయకపోవడం, దిశానిర్దేశం లేని నిర్ణయాలు, జవాబుదారీతనం లోపించడం, సమగ్రత నైతికత లోపించడం వంటి కారణాలతో సహజంగానే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలింది. పదేళ్ల క్రితం దేశం అగ్ర రాజ్యంగా ఎదిగే దిశగా పయనిస్తూ ఉండింది. ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడేందుకు సిద్ధపడింది. ఇప్పుడు పూర్తిగా నిరాశానిస్పృహల్లోకి జారిపోయింది. భారత పునరుజ్జీవానికి అవసరమైన విశ్వాసం, ఉత్సుకత, కాంక్ష ఆవిరైపోయాయి.
ఈ స్థితిలో ఓ వ్యక్తి ముందుకు వస్తాడు. ఇటువంటి స్థితిలో సమర్థుడైన నాయకుడు వస్తాడని చరిత్ర చెబుతోంది. ప్రజలను కూడగట్టే, కఠిన సమస్యలను పరిష్కరించే, తీవ్రమైన ఒత్తిడిరలోనూ, అస్థిరతలోనూ సంక్షోభాలను నివారించగలిగే సమర్థులైన నాయకులు వస్తుండడం చరిత్రలో చూస్తుంటాం. ఢిల్లీలోని మృత్యుప్రాయమైనవాటిని తుడిచిపెట్టడానికి నరేంద్ర మోడీ రూపంలో గుజరాత్ నుంచి పెను గాలి వీస్తోంది. మోడీ జాతీయ తెర మీదికి రావడం అకస్మాత్తుగా ఒక్క రోజులో జరిగింది కాదు. మాతృభూమి సేవకు జీవితాన్ని అంకితం చేసి, క్షేత్రస్థాయిలో శ్రమించి, దశాబ్ద కాలం పాటు సమర్థవంతమైన నాయకత్వాన్ని, పాలనాదక్షతను మోడీ అందిస్తున్నారు.

ప్రగతి, పనితీరు..
వారసత్వ ప్రాతిపదికపై ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు జన్మహక్కుగా భావించే కాంగ్రెసు, చాలా ప్రాంతీయ పార్టీల్లో మాదిరిగా కాకుండా మోడీ పనితీరుపై మాత్రమే ఆధారపడి ప్రసిద్ధి చెందారు. అత్యంత అంధకారంలో కూడా గుజరాత్ ఆయన నాయకత్వ సమర్థతతో ఆశారేఖగా ముందుకు వచ్చింది. గుజరాత్లో భారతదేశంలో మాదిరిగా కాకుండా చాలా విషయాలు సక్రమంగా సాగుతాయని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎకనమిక్ మ్యాగజైన్ వ్యాఖ్యానించింది. భారతదేశం జనాభాలో గుజరాత్ జనాభా ఐదు శాతం మాత్రమే. కానీ దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తిలో 16 శాతాన్ని, ఎగుమతుల్లో 22 శాతాన్ని గుజరాత్ అందిస్తోంది. గత దశాబ్ద కాలంగా గుజరాత్ వృద్ధి రేటులో రెండంకెల ప్రగతిని కొనసాగిస్తూ వస్తోంది. వ్యవసాయ రంగంలో దేశం 3 శాతం వృద్ధిరేటు సాధించడానికి కొట్టుమిట్టాడుతుంటే గుజరాత్ నిలకడగా 10 శాతం వృద్ధి రేటును సాధిస్తోంది. మోడీ సమర్థమైన, స్థిరమైన చర్యల వల్ల కార్మిక సమస్యలు నామమాత్రంగానే ఉన్నాయి, అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది, అధికార యంత్రాంగం సహకారం లభిస్తోంది. వ్యవసాయం, తయారీ, సేవా రంగాల్లో అత్యద్భుతమైన ప్రగతి సాధించిన విషయాన్ని వ్యాపారులు గుర్తించారు. దాంతో సహజంగానే దేశాన్ని ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయడానికి మోడీ వైపు చూస్తున్నారు. తాను సాధించిన విజయాల కారణంగా పరుగు పందెంలో మోడీ అగ్రభాగాన నిలిచాడు.
క్లీన్ ఇమేజ్..
అవినీతి దినసరి చర్యగా మారిన ప్రస్తుత తరుణంలో మోడీ వ్యక్తిత్వ సమగ్రత, నిజాయితీ నిలబడుతుంది. గత కొన్నేళ్లుగా మోడీ వ్యక్తిత్వం, పనితీరు, పెరుగుదల నమూనాలపై విశ్లేషణ జరిగింది. ఏ నాయకుడిని తీసుకున్నా, రాజకీయాల్లో, మీడియాల్లో పరిస్థితిని చూసినా వారందరి కన్నా నిజాయితీగా గన నాయకుడిగా మోడీ ముందుకు వస్తారు. ఆయన విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులు కూడా మోడీపై అవినీతి, కుంభకోణాల మచ్చలేదనే విషయాన్ని అంగీకరిస్తారు. ఇటీవలి వికీలీక్స్ వివాదాలు, అమెరికా దౌత్యపర కేబుల్స్ వెల్లడిలో ప్రతి నాయకుడి పేరు కనిపించింది, వారి వ్యక్తిత్వాలు ప్రశ్నార్థకమయ్యాయి. కానీ మోడీ పేరు మచ్చుకైనా లేదు. మోడీ పేరు కేబుల్లో వందసార్లైనా వచ్చి ఉంటుంది. కానీ ఒక్క వ్యతిరేక వ్యాఖ్య కూడా లేని నాయకుడిగా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మోడీ నిలిచాడు. భారత రాజకీయాలు కుటుంబ వారసత్వానికి, బంధుప్రీతికి నిలయంగా మారిన స్థితిలో దేశంలోని అతి సంపన్నమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ కుటుంబం రెండు పడకగదుల ఇంటికే పరిమితం కావడం చూస్తాం.
ఆర్థిక నిశితదృష్టి
భారతదేశానికి సంబంధించి ఓ నానుడి ఉంది - ఉత్తమ రాజకీయాలు ఉత్తమ ఆర్థికవ్యవస్థకు సంబంధించినవి కావు, ఉత్తమ ఆర్థిక వ్యవస్థ ఉత్తమ రాజకీయాలకు సంబంధించింది కాదు. ఇదంతా ఎందుకంటే - వచ్చే ఎన్నికలను కింద మీదా పడి ఏదో విధంగా గెలుచుకోవాలనే రాజకీయ పార్టీ, ఫలితాలు చూపించడానికి ఏళ్లు తీసుకునే ఆర్థిక విధానాలపై దృష్టి పెట్టదు. కఠినమైన, దార్శనిక నిర్ణయాలు తీసుకునే రాజకీయ ఆకాంక్ష లోపం వల్ల మన ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. యుపిఎ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ రుణాల మాఫీ, ఎన్ఆర్ఇజి వంటి పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తిన్నది. కొత్తగా ఆ ప్రభుత్వం చేపడుతున్న నగదు బదిలీ పథకం, ఆహారభద్రత బిల్లు కూడా ఆ దిశలోనే సాగుతాయి. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాటిని యుపిఎ ప్రభుత్వం చేపడుతోంది. ఆర్థిక క్రమశిక్షణ ఎవరికి పడుతుంది? అమలుకు తగిన మౌలిక సదుపాయాలు లేకుండా, చేపట్టే ఆ పథకాలు ప్రభుత్వ ఖజానాకు భారం కావడమే కాకుండా లబ్ధిదారులకు ప్రయోజనం కూడా కల్పించలేవని విధాననిర్ణేతలు కూడా అంటున్నారు. స్వల్పకాలిక ప్రయోజనాలను పక్కన పెట్టి కఠినమైన, ప్రయోజనసహితమైన నిర్ణయాలు తీసుకోవడమే నాయకుడికి పరీక్షగా నిలుస్తుంది. ఆ రకమైన ప్రదర్సనను మోడీ గుజరాత్లో ఎల్లవేళలా చూపించారు. 2001 నుంచి తన పాలనలో మోడీ ఎప్పుడు కూడా ప్రజాకర్షక పథకాలకు తావు ఇవ్వలేదు. ప్రతికూలంగా కనిపించిన 2012 ఎన్నికల్లో ఆయన కొన్ని ఉచిత హామీలు, సబ్సిడీలు ఇచ్చి ఉంటే మరిన్ని సీట్లను మోడీ గెలుచుకుని ఉండేవారు. కానీ ఆ మార్గాన్ని ఆయన ప్రతిఘటించారు. మోడీ ఎల్లవేళలా దీర్ఘకాలిక పెరుగుదలను, ఉపాధిని, జీవనశైలి మెగురును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులను సృష్టిపైనే దృష్టి కేంద్రీకరించారు. స్వల్పకాలిక రివార్డులు ఆకర్షణగా నిలిచిన సమయంలో అటువంటి చర్యలు చేపట్టడానికి నాయకుడికి ఎనలేని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ఉండాలి. ఓటు బ్యాంకు కోసం తలపెట్టన ఆహార భద్రతా బిల్లును ఎదిరించే ధైర్యం మోడీ తప్ప మరొకరు చేయడం లేదు.
మాస్ అపీల్..
మోడీ మాత్రమే కేంద్రంగా మారి, ప్రతి ఒక్కరినీ తనతో నడిపించుకునే వెళ్లే గుణం లేదనే విమర్శకు గురువుతుంటారు. ఆ విమర్శ పూర్తిగా తప్పు, పక్షపాతంతో కూడిందని ఇటీవలి హైదరాబాద్ ర్యాలీని గమనిస్తే అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని పరిష్కరించడానికి కాంగ్రెసు తీసుకున్న అవకాశవాద చర్య వల్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తీవ్రమైన వైఖరిని తీసుకున్నారు. తెలంగాణ సీమాంధ్ర పేరు ఉచ్చరించే సాహసం కూడా ఓ ఒక్క రాజకీయ నాయకుడు చేయలేని పరిస్థితి ఉంది. విద్వేషాలను విడనాడి, అభివృద్ధికి భుజం భుజం కలిపి నడవాలని మోడీ సీమాంధ్ర సోదరులకు విజ్ఝప్తి చేశారు. హైదరాబాద్ గడ్డ మీద నిలబడి తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు యావత్తూ హర్షించే విధంగా మోడీ మాట్లాడారు. దీనికి అమేయమైన రాజకీయ ధైర్యం కావాల్సి ఉంటుంది. దాన్ని మోడీ ప్రదర్శించారు.
ప్రగతి పథం..
మోడీ సాధించిన ఒక విజయం దేశాన్ని వోటు బ్యాంక్ రాజకీయాల నుంచి ప్రగతి రాజకీయాల వైపు నడిపిస్తుంది. ఎన్నికల్లో విజయం కులం లేదా మతంపై ఆధారపడి ఉండడమనేది భారతదేశ ప్రజాస్వామ్యం పెద్ద లోపం. అన్నింటికన్నా కులం లేదా మతం విజయానికి మూలకారణమవుతోంది. అభ్యర్థి ట్రాక్ రికార్డు, వ్యక్తిత్వం అప్రధామవుతున్నాయి. అటువంటి సంకుచిత మనుగడలను పరిగణనలోకి తీసుకోవడాన్ని మోడీ దూరం పెట్టారు. గత పదేళ్ల కాలంలో కుల ప్రాతిపదికను ఎన్నికల్లోకి తీసుకుని రాలేదు. గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందనే ప్రాతిపదిక మీదనే గుజరాత్లో ఎన్నికలు జరుగుతాయి. పైగా, తన ప్రభుత్వాన్ని, విధానాలను తిరుగులేని పరీక్షకు, విమర్శకు, చర్చకు పెట్టడాన్ని ఆహ్వానించారు. ప్రతి సామాజిక, అభివృద్ధఇ సూచికను వెలికి తెచ్చి, విశ్లేషించడానికి అనుమతించారు. అటువంటి విధానాలకు భారత ప్రభుత్వం పూనుకుని ఉంటే దేశపరిస్థితి మరో విధంగా ఉండేది.
సమర్థతతో కూడిన దేశభక్తి
భారతదేశం బయటి నుంచి లోపలి నుంచి తీవ్రమైన భద్రతా ముప్పును ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి కఠిన నిర్ణయాలు తీసుకునే నాయకుడి అవసరం ఉంది. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందనే విషయంపై కచ్చితమైన, వాస్తవిక దృక్పథం కలిగిన నాయకుడు కావాలి. అది రక్షణ బలగాలకు సమర్థమైన రాజకీయ మద్దతును సమకూరుస్తుంది. ప్రజల్లో అది స్ఫూర్తిని అందించి ప్రేరణను ఇస్తుంది. ఈ విషయంలో మోడీని మించిన నాయకుడు లేదు.
ప్రస్తుత అవసరం..
దేశ భద్రత, విదేశాంగ విధానం, ప్రభుత్వాన్ని కుదించడం, సాధికారితను సాధించడం, ఎన్నికల సంస్కరణల అవసరం వంటి అన్ని విషయాలపై మోడీ అనర్గళంగా అవగాహనతో మాట్లాడగలరు. మిగతా నాయకులతో పోలిస్తే మోడీకి దృక్పథం, ఆశ ఉన్నాయి. కఠిన శ్రమ, కృతనిశ్చయాలతో ఆ మామూలు పిల్లవాడు గుజరాత్ ప్రజల మనసులు దోచుకున్న నాయకుడిగా మోడీ ఎదిగారు. ఈ విషయంలో కాంగ్రెసు తీరు గర్హనీయమైంది. చాయ్ వాలా, స్టాల్ వర్కర్ వంటి పేర్లతో పిలుస్తూ కాంగ్రెసు, అది పెంచి పోషించిన జర్నలిజం మోడీ నేపథ్యం గురించి మాట్లాడడం ఆక్షేపణీయమైంది. నిజానికి, మామూలు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలున్నాయనే విషయంలో స్ఫూర్తిగా నరేంద్రమోడీ ఎదిగారు. అది అత్యంత గర్వకారణమైన విషయం. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి కెమెరా సిబ్బందితో కామికల్ యువరాజు గ్రామాలు తిరుగుతున్నారు. 43 ఏళ్ల వయస్సులో కూడా అతను భారతదేశం వాస్తవ సమస్యలను అర్థం చేసుకోవడానికి ఆందోళనకు గురువుతున్నాడు.
రాజకీయ ప్రత్యర్థులు, వివక్షాపూరితమైన మీడియా, స్వార్థ ప్రయోజనాలు గల ఎన్జీవోలు, కుహనా మేధావులు వేటకు గురైన బాధితుడు మోడీ. అటువంటి నిరంతర విషపూరిత, వ్యక్తిగత ప్రచారానికి మరొకరైతే కుప్పకూలిపోయి ఉండేవారు. మోడీ తన వ్యక్తిత్వం ద్వారా, నిబద్ధత ద్వారా మోడీ మరింత బలాన్ని సమకూర్చుకుంటూ, మరింత కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. రాజకీయం మారుతోంది. దేశం ఎదుర్కుంటున్న సమస్యలకు సమాధానం కోసం భారతీయులు ఎదురు చూస్తున్నారు. స్వతంత్ర సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహించిన పలు సర్వేల్లో నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ గల నాయకుడని తేలింది. మరో నాయకుడు ఆయనకు దరిదాపుల్లో కూడా లేడని ఆ సర్వేలు తేల్చాయి.
ఆహ్వానించదగిన మోడీ జాతీయ నాయకత్వం కేవలం వ్యక్తి ఎదుగుదల కాదు. విక్టర్ హ్యూగో మాటల్లో చెప్పాలంటే, మోడీ ఓ ఐడియా, ఆయన సమయం వచ్చింది. ఆయన వస్తే మర్చంట్ ఆఫ్ డెత్ - ఉగ్రవాదానికి మర్చెంట్ ఆఫ్ డెత్, వోటు బ్యాంకు, బంధుప్రీతికి మర్చంట్ ఆఫ్ డెత్, రాజకీయ, అధికార యంత్రాంగ అసమర్థతకు మర్చెంట్ ఆఫ్ డెత్, అంధకారానికి, నిరాశకు మర్చెంట్ ఆఫ్ డెత్.
- అపూర్వ షా
(రచయిత ఐఐటి పోవాయ్ ఎంబిఎ చేశారు. బిఎఫ్ఎస్ఐ రంగంలో ఐదేళ్ల పాటు పరిశోధన, విశ్లేషణ చేశారు).












Click it and Unblock the Notifications