పాఠకుల ప్రతిస్పందన
మీడియా కొన్ని సార్లు చాల్బాజీ (అతి తెలివి)ని, మరోసారి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. చాల్బాజీకి కొంత అజ్ఞానం కూడా తోడైతే అది ఎంత దాకా పోతుందో చెప్పలేం. ఈ రెండు గుణాల వల్ల జరిగే నష్టం, ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దే క్రమం చిన్నదేమీ కాదు. మీడియా అంతర్గత ఏదో రాజకీయ పార్టీకి లేదా రాజకీయ మార్గానికి అండగా నిలవడం రహస్యమేమీ కాదు. ఆ ఎరుకతో పాఠకులు ఈ మధ్యకాలంలో పత్రికలు చదువుతున్నారనేది స్పష్టం. అయితే కొన్నిసార్లు ఈ చాల్బాజీ, అజ్ఞానాన్ని బహిరంగంగా ప్రదర్శించడం కూడా గమనించవచ్చు. ఇందుకు ఇటీవలి కొన్ని సంఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు.
కాంగ్రెస్ మొదటి రాష్ట్రాల పునర్విభజన కమీషన్కు అంగీకరిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ప్రతిస్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణను, మహారాష్ట్రలోని విదర్భను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో చేర్చనున్నట్లు బయటకు పొక్కింది. ఈ వార్తను మసి పూసి మారేడుకాయ చేయాలనుకుంటే ఎలా ఉంటుందో ఒక ప్రముఖ ప్రైవేట్ టీవీ ఛానల్ వార్తా ప్రసారం తెలియజేస్తుంది. సమగ్ర భారత్ లక్ష్యం అంటూ ఇన్నాళ్లూ ప్రకటించిన కాంగ్రెస్ మహారాష్ట్రను విడదీస్తూ విదర్భను, ఆంధ్రప్రదేశ్ను విడదీస్తూ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేసే అంశాన్ని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చబోతున్నది అని ఆ టీవీ ఛానల్ వార్తా ప్రసారం. ఇది అతి తెలివికి లేదా చాల్బాజీకి నిదర్శనం కాకపోతే ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గానీ, విదర్భ రాష్ట్ర ఏర్పాటు గానీ సమగ్ర భారత్ లక్ష్యానికి ఏ విధంగా విరుద్ధమో వార్తా రచయితలకు లేదంటే వార్తలను ఎడిట్ చేసేవారికి, చివరగా ఎడిటర్కు తెలియదనుకోవాలా? ఈ రెండు రాష్ట్రాలను ఏర్పాటు భారత సమైక్యతకు విఘాతమైతే ఇటీవల ఏర్పడిన జార్ఖండ్, తదితర రాష్ట్రాలు ఆ లక్ష్యానికి విరుద్ధమనే భావించాలా? భారత్ నుంచి విడిపోవడానికి ఈ ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలు సాగడం లేదు కదా! భారత్లో అంతర్భాగంగా ఉంటూనే, భారత రాజ్యాంగానికి కట్టుబడుతూనే ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడాలని విదర్భ, తెలంగాణ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. ఒక రకంగా ఈ టీవీ వార్తా ప్రసారం రెండు సమాజాల మధ్య వైషమ్యాలు పెంచి పోషించేదిగా ఉందే తప్ప మేలు చేసేదిగా లేదు.
అలాగే ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికలో తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో లేదంటూ ఒక వ్యాసం అచ్చయింది. ఆ వ్యాసం వార్తా ప్రతికాకార్యాలయం వెలుపలి నుంచి రాసి వుంటే పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఆ వ్యాసం రాశారు. అసలు సెంటిమెంట్ అనే మాటే సరైంది కాదు. తెలంగాణ అనేది ఒక వాస్తవం. వాస్తవాన్ని సెంటిమెంట్గా చిత్రీకరించడంలోనే పెద్ద పొరపాటు ఉంది. ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రజల్లో బలంగా లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) తన సత్తాను నిరూపించుకొని ఉండేదా? టిఆర్ఎస్కు బలం లేకుంటే కాంగ్రెస్ పొత్తుకు సిద్ధపడేదా? కనీసావగాహన ఉండేవారెవరైనా వేసుకునే ప్రశ్నలు అవి.
ఇక మూడోది, నక్సలైట్లను ఎదుర్కోవడానికి ప్రజలకు తుపాకులిస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనకు స్పందిస్తూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) మాజీ చంద్రబాబు సివిల్ వార్ను ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. సివిల్ వార్ అనే మాటకు ఒక ప్రముఖ నిరంతర వార్తా ప్రసార టీవీ చానల్తో పాటు ఒక ప్రముఖ దిన పత్రిక ప్రజాయుద్ధం అనే అనువాదం చేశాయి. ప్రజాయుద్ధం అనే మాటకు దుర్గుణాల కన్నా సుగుణాలు ఎక్కువగా ఉన్నాయి. కనీసం ఈ విషయాన్నైనా అనువాదం చేసే సమయంలో ఆ సంస్థలు పట్టించుకున్నట్లు లేదు. సివిల్ వార్ అనే మాటకు అంతర్యుద్ధం అనే అనువాదం చేయాలనే ఆలోచన ఆ వార్తా రచయితలకు రాలేదా? ఒక ప్రముఖ రాజకీయ పార్టీ వార్తలు సేకరించి రాసేవారు అంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటే ఇక విషయ పరిజ్ఞానం గురించి చెప్పేదేముంది?
రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు ఎలా వ్యవహరించినా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఈ మాత్రం ఉందంటే అది మీడియా చలువనే. మీడియా కూడా పతనమైతే దేశానికి దారి కరువు అవుతుంది.












Click it and Unblock the Notifications