లఘు చిత్రాల వేదిక కరీంనగర్

ఫిబ్రవరి 13న సాయంత్రం ఫిలింసొసైటీ భవనం “ఫిలింభవన్" లో చిత్రోత్సవాన్ని ప్రారంభించిన ప్రముఖ దర్శకుడు బి.నరసింగరావు మాట్లాడూతూ ఉత్తమ విలువలు కలిగిన సినిమాల్ని ప్రదర్శించడం, ఔత్సాహికులను ప్రోత్సాహించడం గొప్ప సాంస్కృతిక బాధ్యత అన్నారు. మంచి సినిమాలకు, సామాజిక కోణం వున్న డాక్యుమెంటరీలకు ఫిలిం సొసైటీలు చిరుదెవ్వెలు అన్నారు. కొత్తతరం దర్శకులు కరీంనగర్ చిత్రోత్సవం లాంటి వేదికల నుంచే ఉద్బవిస్తారని అన్నారు. ముఖ్యాతిధిగా హాజరయిన జిల్లా కలెక్టర్ ఎం.వి.సత్యనారాయణ కరీంనగర్ ఫిలింసొసైటీ వెబ్సైట్ http://www.kafiso.org/ను ప్రారంభించారు. చిత్రోత్సవం రెండవరోజు ప్రతిష్టాత్మకమైన ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో ప్రదర్శనల్ని ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.విజయకుమార్ మాట్లాడుతూ మీడియా రంగం విస్తారంగా అభివృధ్ధి చెందుతున్న తరుణంలో యువతీయువకులు టివి సినిమా రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం వుందన్నారు. ఆ రోజు సాయంత్రం ఫిలింభవన్ లో జరిగిన కార్యక్రమంలో “పచ్చబొట్టు" చిత్ర దర్శకురాలు లతామోహన్, “తలైవా" దర్శకుడు చిలివేరి కిశోర్, “విముక్తి" దర్శకుడు రాజు పాల్గొన్నారు. లతా మోహన్ మాట్లాడుతూ సినిమా రంగంలోకి స్త్రీలు మంరింతగా ముందుకు రావాలని సూచించారు. తన చిత్రం పర్యావరణాన్ని ఇతివృత్తంగా చేసుకుని నిర్మించబడిందన్నారు. కిశోర్ మాట్లాడుతూ “తలైవా" హైదరబాద్ ట్యాంక్ బండ్ పైన కనిపించే హస్తాసాముద్రికుల్ని ప్రధాన పాత్ర చేసుకుని నిర్మించినట్టు చెప్పారు. బాల కార్మికుల జీవితాల పై తీసిన “విముక్తి" చిత్రం వివరాల్ని రాజు వివరించారు.
చిత్రోత్సవం మూడవ రోజు విజయవాడకు చెందిన షార్ట్ ఫిలిం “వన్ డే" దర్శకుడు పి.ఎం సుందరరావు చిత్రప్రదర్శనల్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో దర్శకుడు సుందరరావు మాట్లాడుతూ తెలంగాణాకు చెందిన కళాకారులు సామాజిక ఆత్మీయ కోణం లోంచి సృజన చేస్తున్నారని అన్నారు. డాక్యుమెంటరీ సినిమాలు సమాజాల్ని భిన్నమైన కోణంలో, విభిన్నమయిన ద్రక్ఫధంతో ఆవిష్కరిస్తాయని పేర్కొన్నారు. కళాశాల తెలుగు విభాగం అధిపతి సాహితీవేత్త డాక్టర్ గండ్రలక్ష్మణ రావు మాట్లాడుతూ యువతీయువకులు వ్యాపార సినిమా గాలిలో పడి కొట్టుకు పోరాదని సూచించారు.
ఇలా ఆరు రోజులపాటు విజయవంతంగా సాగిన ద్వితీయ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో పలువురు సినిమా దర్శకులతో పాటు ఉత్తమ సినిమా అభిమానులు, విద్యార్థులు, ఫిలిం సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. డిజిటల్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో యువతీయువకులు సినిమారంగంలోకి దూసుకు రావాల్సిన అవసరం వుందని ఫెస్టివల్ డైరెక్టర్ ప్రధాన నిర్వాహకుడు వారాల ఆనంద్ ఈ సందర్భంగా అన్నారు. తెలుగు సాహిత్యంలో విలక్షణమయిన స్థానాన్ని పొందిన కరీంనగర్ భవిష్యత్తులో డాక్యుమెంటరీ రంగంలో కూడా ప్రత్యేకతను చాటుతుందన్నారు. ఈ ఏడూ ముగ్గురు యువ దర్శకులు కరీంనగర్ నుంచి తమ చిత్రాలు ప్రదర్శించారని భవిష్యత్తులో ఆ సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిలింఫెస్టివల్ని పోటీ ఉత్సవంగా నిర్వహించి మరింత విస్తృత పరుస్తామని వారాల ఆనంద్ అన్నారు.
మొత్తంమీద రానున్న కాలంలో కరీంనగర్ డాక్యుమెంటరీ,లఘు చిత్రాలకు చిరునామాగా మారతుందనిపిస్తుంది.












Click it and Unblock the Notifications