సీమాంధ్ర వర్సెస్ తెలంగాణ
మిగతా ప్రాంతాల విద్యార్థులు పరీక్షలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు. తాము పరీక్షలకు పూర్తిగా ప్రిపేర్ అయ్యామని, వాయిదా వేస్తే తమ సమయం వృధా అవుతుందని, ఇన్నాళ్లు చదివింది కూడా వేస్ట్ అవుతుందని అంటున్నారని సీమాంధ్ర వర్గాలు అంటున్నాయి. ఎపిపిఎస్సీ చైర్మన్ గా రాయలసీమకు చెందిన వెంకటరామిరెడ్డి ఉన్నారు. ఆయనపై వైయస్ కు సన్నిహితుడనే ముద్ర ఉంది. ఆయన రెండో సారి ఎపిపిఎస్సీ చైర్మన్ గా పని చేస్తున్నారు. వైయస్ సన్నిహితుడు కాబట్టే ఆయన పదవీ కాలాన్ని పొడగించారనే విమర్శ ఉంది. సీమాంధ్రుల ఆధిపత్యంలో ఉండడం వల్ల తమకు గ్రూప్ - 1 ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందని తెలంగాణవాదులు అంటున్నారు.
రాతపరీక్షల్లో తమకు ఎక్కువ మార్కులు వస్తున్నాయని, ఇంటర్వ్యూలో మాత్రం తక్కువ మార్కులు పడుతున్నాయని, సీమాంధ్రులు కావాలనే తమకు ఉద్యోగాలు రాకుండా ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వేస్తున్నారని తెలంగాణకు చెందిన విద్యార్థులు, అభ్యర్థులు అంటున్నారు. అందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ విద్యార్థి జెఎసి నాయకులు గణాంకాలతో సహా పలు తెలుగు ప్రైవేట్ టీవీ చానెళ్లలో వివరించారు. తెలంగాణ విద్యార్థుల డిమాండ్ కు ఎపిపిఎస్సీ మాజీ బోర్డు డైరెక్టర్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. తమ వాటా తేల్చకుండా పరీక్షలు రాస్తే వాటిని బహిష్కరిస్తామని తెలంగాణ అభ్యర్థులంటున్నారు. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 4వ తేదీన తరగతుల బహిష్కరణకు, 5వ తేదీన తెలంగాణ బంద్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జెఎసి పిలుపునిచ్చింది. ఈ స్థితిలో గ్రూప్ - 1 ప్రిలిమినరీ పరీక్షలపై నీలినీడలు అలుముకున్నాయి.