ఆ గడియ కోసం ప్రతి భక్తుడు నిరీక్షిస్తాడు..
కర్నాలి, బ్రహ్మపుత్ర, సట్లెజ్, ఇండూస్ నదులకు జన్మస్థలంగా ఉన్న మానస సరోవరం సముద్ర మట్టానికి 4556 మీటర్ల ఎత్తులో ఉంది.మానస సరోవరం పడమటి వైపు రక్షస్తలి సరస్సు, ఉత్తరం వైపు కైలాస శిఖరం ఉంది. ఈ ప్రాంతంలో శ్వాస తీసుకోవడం కాస్త కష్టం అయినప్పటికి.. ఉమాశంకరుడి దర్శనానికి పరితపించే మనస్సు అలాంటి సమస్యలను లెక్కచేయకుండా చేస్తుంది. ప్రపంచంలో కల్లా ఎత్తైన స్వచ్ఛమైన నీటి జలపాతంలో స్నానం చేసినా, ఆ నీటిని తాగినా తమ పాపాలు పటాపంచలవుతాయని భక్తలు నమ్మకం. ఈ ప్రాంతంలో ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య బ్రహ్మి ముహుర్తంలో భోలా శంకరుడు స్నానం చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
చైనా, టిబెట్ దేశాలో పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి యత్ర చేయటమే ఓ గొప్ప అనుభూతి, భారత్, నేపాల్ తో పాటు అనేక దేశాల నుంచి హిందువులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకుంటారు. మానస సరోవరానికి సమీపంలో కొలువుతీరిన ముక్తినాథ్ వద్ద 108 జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంతో సహా ఎన్నో పర్వతాలను వీక్షించడం మాటలకందని మధురానుభూతి.
ఎన్నో విశిష్టతలు ఇమిడి ఉన్న ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో మానవ మేథస్సుకు అర్థంకాని విషయాలు దాగి ఉంటాయి. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తుడు ఒక విచిత్రమైన అనుభూతితో తిరిగి వస్తాడు. ఈ ప్రాంతంలో పర్యటించినప్పడు ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం తమకు కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.