జగన్ ధీమా అదే: ముక్తసరిగానే జైలులో..

జగన్ జైలు పాలు కావడంపై ఓ విఐపి ఖైదీ ఆవేదన వ్యక్తం చేశారట. అయితే దానికి దీమాగా 'మరేం ఫర్వాలేదు, నాకేమీ కాదు, మహా అయితే జరిమానా కడతాను! ఎప్పటికైనా సోనియా మన వద్దకు రావాల్సిందే!' అని జగన్ చెప్పినట్లు తెలిసిందంటూ ఓ ప్రముఖ పత్రిక రాసింది. జగన్ అవసరాలన్నీ దగ్గరుండి చూసుకునేందుకే ఎమ్మార్ కేసులో నిందితుడు సునీల్ రెడ్డి జైలుకు వచ్చాడా అనే అనుమానం కలుగుతోందంటూ ఆ పత్రిక వ్యాఖ్యానించింది. జగన్కు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటున్నాడట.
ఇక మిగతా వివిఐపి ఖైదీల విషయానికి వస్తే.. వారు కూడా ఉల్లాసంగానే ఉన్నారట. ఆ ఖైదీలకు వండిపెట్టేందుకు బాగా చెయ్యి తిరిగిన నల భీముడిలాంటి ఓ 'బావర్చి ఖైదీ' (వంటచేయగలిగిన ఖైదీ) ఉన్నాడంటూ ఆ తెలుగు దినపత్రిక రాసింది. ఇతను ఓ హత్య కేసులో అరెస్టయ్యాడు. వీఐపీల దుస్తులు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయడంతోసహా రకరకాల వ్యక్తిగత పనులు చేసి పెట్టేందుకు కొంతమంది ఖైదీలు పోటాపోటీ పడుతున్నారట.
చంచల్గుడా జైలులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య, ఒఎంసి డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు ఈ జైలులో ఉన్నారు. వీరంతా చంచల్గూడ జైలులో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారట. విఐపి ఖైదీలందరూ రోజూ ఉదయాన్నే నిద్ర లేస్తున్నారు. కాలకృత్యాల అనంతరం ఎవరి అలవాటును బట్టి వారు... మార్నింగ్ వాక్, యోగా, షటిల్ వంటి వ్యాపకాలతో ఆరోగ్యాన్ని యథాతథంగా కాపాడుకుంటున్నారు. ఆ తర్వాత స్నానం! జైలు ఆవరణలోనే ఉన్న షిరిడీ సాయిబాబా విగ్రహానికి నమస్కారం! ఆపైన... టిఫినీలు, కాఫీలు! అంటూ ఆ పత్రిక వివరంగా రాసింది.
కాఫీలు టిఫిన్ల తర్వాత వీరి మకాం చంచల్గూడ జైలు ఆవరణలోని మామిడి చెట్టు అరుగు మీదికి మారుతుంది. కాసేపు... పత్రికా పఠనం, పిచ్చాపాటీ! ఆ తర్వాత కాలక్షేపం కోసం చతుర్ముఖ పారాయణంలోకి దిగుతున్నారట. అయితే, టీవీ చానెల్లో ఒక్క దూరదర్శన్ కార్యక్రమాలు మాత్రమే వారికి అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications