అమరావతి అండ్ కో: పెట్టుబడులపై జపాన్ షరతేంటీ?
గుంటూరు: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కోసం భూసమీకరణ దాదాపు పూర్తయింది. సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ కూడా సింగపూర్ ప్రతినిధులు సీఎం చేతికందించారు. దీంతో నవ్యాంధ్ర రాజధానిపై ప్రభుత్వం తదుపరి కార్యచరణపై దృష్టి సారించింది.
రాజధాని నిర్మించాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయి. ఈ క్రమంలో కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రభుత్వ అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా 'అమరావతి అండ్ కో' పేరుతో ఓ కంపెనీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇందులో ఆంధ్రప్రదేశ్, సింగపూర్, జపాన్ ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉంటాయి. ఈ ప్రతిపాదనకు సింగపూర్ ప్రభుత్వం గతంలోనే ఆమోదం తెలిపింది. తాజాగా అమరావతి నిర్మాణంలో జపాన్ ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది.

అంతేకాదు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్ 'అమరావతి అండ్ కో'లో ప్రధాన వాటాదారుగా చేరేందుకూ జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఎవరి పెట్టుబడి ఎంత ఉంటుందన్నదానిపైనే వాటా కూడా అధారపడి ఉంది. సింగపూర్, జపాన్లలో ఒక దేశానికి 50 శాతం ఉంటుందని చెబుతున్నారు.
ఏపీకి 25 శాతం వాటా ఉంటుందనే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నేరుగా ఈ కంపెనీలో డబ్బు రూపంలో పెట్టుబడి పెట్టకుండా, తన వాటాగా రాజధాని ప్రాంతంలోని భూములను చూపించనుందని సమాచారం.

రాజధాని అమరావతి నిర్మాణం మొత్తం 'అమరావతి అండ్ కో' ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇందులో కొన్ని సంస్ధలు కన్సార్టియంగా ఉండే అవకాశం ఉంది. సింగపూర్ ప్రభుత్వం తన తరపున మూడు సంస్థలను ఎంపిక చేసింది. ఈ కన్సార్టియంలో ఇవి భాగస్వాములుగా ఉంటాయి. జపాన్ కూడా తన తరుపున సంస్థలను నామినేట్ చేస్తుంది.
అయితే కన్సార్టియంగా ఉండి రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవాలంటే జపాన్ ఒక షరతు విధించింది. అదేంటంటే రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమయ్యే వస్తు సామాగ్రిలో 65 శాతాన్ని జపాన్ దేశానికి చెందిన కంపెనీల నుంచే కొనుగోలు చేయాలి.
మిగిలిన 35 శాతం వస్తు సామాగ్రిని ఎక్కడ కొనుగోలు చేసుకున్నా, అ దేశానికి అభ్యంతరం లేదని పేర్కొంది.

ఒకవేళ ఈ నిబంధనకు ఒప్పుకోకపోతే, మరో ప్రతిపాదనను ప్రస్తావించింది. రాజధాని నిర్మాణం కోసం ఆ దేశం ఖర్చు చేసే మొత్తంపై 4 నుంచి 5 శాతం వడ్డీ చెల్లించాలని సూచించింది. ఈ రెండింటిపై తీవ్ర స్ధాయిలో చర్చించిన ఏపీ ప్రభుత్వం మొదటి షరతుకే మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎందుకంటే, సాధారణంగా జపాన్ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువుల్లో నాణ్యత ఉంటుందన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఆ దేశ కంపెనీల నుంచి వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడంలో వచ్చే ఇబ్బందేమీ లేదని కూడా ఏపీ ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications