ఊపిరాడని ఢిల్లీ: కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి(పిక్చర్స్)
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంది. తీవ్రమైన కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, ఢిల్లీ వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

పాఠశాలలకు సెలవులు
ఢిల్లీలో సుమారు 16వేల పాఠశాలలున్నాయి. వీటిలో 10లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఆదేశాలతో పాఠశాలలన్నీ మూతపడ్డాయి. కొన్ని పాఠశాలలు 9వ తేదీ వరకు, మరికొన్ని 12వ తేదీ వరకు సెలవులు ప్రకటించాయి.

అవసరమైతేనే బయటికి రండి
పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు కళ్లల్లో మంట, శ్వాసకోశ సమస్యలకు గురవుతుండటంతో ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. అత్యవసర పనులు ఉంటే తప్పించి.. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించింది.

థర్మల్ విద్యుత్ కేంద్రం ఉత్పత్తి నిలిపివేత
గాలిలో దుమ్మ, ధూళి శాతాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే కేంద్రాన్ని సంప్రదించినట్లు సమాచారం. మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. డీజిల్ జనరేటర్లపైనా ఐదు రోజుల పాటు నిషేధం విధించారు.

నివారణ చర్యలు
వాతావరణ కాలుష్యం సమస్యను ఎదుర్కోవడానికి నగరంలో తీసుకోవాలని నిర్ణయించిన అత్యవసర చర్యలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు భవన నిర్మాణాలను, కూల్చివేతలను నిషేధించినట్లు ఆయన తెలిపారు. బాదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పది రోజుల పాటు మూసివేస్తున్నట్టు తెలిపారు.

మళ్లీ సరి బేసీ
పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్లలో పెద్దఎత్తున పంటలను దగ్ధం చేయడం వల్ల ‘గ్యాస్ చాంబర్'లాగా మారిన ఢిల్లీ నగరంలో కృత్రిమ వర్షాలను కురిపించే విషయమై తమ ప్రభుత్వం కేంద్రంతో చర్చిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. సరి-బేసి సంఖ్యల వాహన పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టే విషయంపైనా ఆప్ సర్కారు యోచిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో దీనిపై ఒక అంచనాకు వస్తామని, అవసరమైతే తిరిగి ప్రవేశపెడతామని సిఎం చెప్పారు.

చెత్త కాల్చొద్దు
దుమ్ము, ధూళిని తగ్గించడానికి సోమవారం నుంచి రోడ్లపై పెద్ద ఎత్తున నీటిని చల్లించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. నవంబర్ 10వ తేదీ నుంచి రోడ్లను వాక్యూమ్ క్లీనర్లతో శుభ్రం చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆకులను, చెత్తను కాల్చేవారి పట్ల అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు.

ఇంటి నుంచే..
ఆరోగ్య శాఖ సోమవారం కాలుష్యానికి సంబంధించి తొలిసారి సలహాలను జారీ చేస్తుందని ఆయన తెలిపారు. వీలయినంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఇంటి నుంచే పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు.

పెరిగిన ఎయిర్ ఫ్యూరిఫైయర్ల వాడకం
ఢిల్లీలో వాతావరణ పరిస్థితి తీవ్రంగా దిగజారడంతో ఎయిర్ ప్యూరిఫయర్లు వాడే ప్రజల సంఖ్య పెరిగింది. దీపావళి తరువాత వీటి అమ్మకాలు నాలుగింతలు పెరిగాయి. దీంతో తయారీదారులు వీటి ఉత్పత్తిని బాగా పెంచారు. కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఢిల్లీలో కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications