చిరుపై దాసరి కత్తి
నిజానికి, దాసరి నారాయణరావుకు సామాజిక న్యాయం పట్ట ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహన ఉంది కాబట్టే ఆయన మాదిగ దండోరా నేత మందకృష్ణ మాదిగతో కలిసి పని చేయడానికి కూడా సిద్ధ పడ్డారు.మందకృష్ణ మాదిగతో కలిసి ఓ పార్టీ పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. అయితే మందకృష్ణ మాదిగ వ్యవహారాలు అందుకు సహకరించలేదు. దాంతో ఆయన వెనక్కి తగ్గారు.ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాల్లోనూ ఆయన అవగాహన బయట పడుతుంది. ఈ స్థితిలో ఆయన చిరంజీవి సామాజిక న్యాయం సూత్రం అమలుపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రకటించిన దాసరి ఇప్పటి దాకా వాటికి దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా కోరడంతో ఆయన ఎన్నికల ప్రచారంలోకి దిగారు. చిరంజీవి పోటీ చేస్తున్న చిరంజీవిలో ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.ఈ సభలో ఆయన చిరంజీవిపై విమర్శలు చేశారు. చిరంజీవి పాటించింది సామాజిక న్యాయం కాదని రాజకీయ న్యాయం మాత్రమేనని ఆయన చెప్పారు.బిసిలకు బీసీలను పోటీ పెట్టడం సామాజిక న్యాయం అనిపించుకోదని ఆయన చెప్పారు. పేదవాడిని ఉన్నవాడికి దగ్గర చేయడం సామాజిక న్యాయం అవుతుందని ఆయన అసలు విషయం చెప్పారు.
తిరుపతిలో చిరంజీవికి వ్యతిరేకంగా గమ్మత్తయిన ప్రచారం జరుగుతోంది. చిరంజీవిని గెలిపిస్తే కలవడానికి కూడా వీలు కాదని, అప్పుడు మీ సమస్యలు వినేవారు కూడా ఉండరని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి తోడు దాసరి నారాయణరావు లాంటి వారి ప్రచారం చిరంజీవిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంటున్నారు.