జెపిపై బాబు కోపం వెనక..
నిజానికి, నాగార్జున కాంగ్రెసుకు దగ్గరగా ఉంటున్నారు. లోకసత్తాకు చాలా క్రితం నాగార్జున ప్రచారం చేశారు. దాన్ని ఇప్పుడు ప్రస్తావించడానికి కారణం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే. లోకసత్తా పట్టన, నగర మధ్య తరగతి ప్రజల్లో, యువతలో బలమైన ప్రభావం వేస్తోంది. క్రమంగా అది చాప కింద నీరులా పరుచుకుంటున్న సూచనలు శాసనసభ, లోకసభ ఎన్నికల్లో తేలిపోయింది. జయప్రకాష్ నారాయణ కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి శాసనసభకు కూడా ఎన్నికయ్యారు. తమ పార్టీని బలహీన పరుస్తూ కాంగ్రెసుకు లాభం చేకూరేలా లోకసత్తా విస్తరిస్తోందని తెలుగుదేశం అక్కసు అని అంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లోకసత్తా ప్రభావం చెప్పుకోదగిన రీతిలో ఉండవచ్చు. చంద్రబాబు, జెపి ఒక సామాజిక వర్గానికి చెందినవారు. ఆ సామాజిక వర్గం క్రమంగా తెలుగుదేశం నుంచి లోకసత్తాకు మళ్లుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. హైదరాబాదులోని మధ్యతరగతి ప్రజలు, యువత లోకసత్తా వైపు ఏ మాత్రం మొగ్గు చూపినా అది తెలుగుదేశం పార్టీకే నష్టం తెచ్చి పెడుతుంది. అలాగే, ఆంధ్ర సెటిలర్లు కూడా జెపిని నమ్మినంతగా, చంద్రబాబును నమ్మడం లేదు. వారు మూకుమ్మడిగా జెపి వైపు మొగ్గు చూపితే తెలుగుదేశం పార్టీకి నష్టమే వాటిల్లుతుంది. ఈ దృష్ట్యా తెలుగుదేశం పార్టీ లోకసత్తాను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తోంది.