కెసిఆర్ కు కలిసొస్తున్న కాలం
ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని వాదిస్తున్న సీమాంధ్ర మంత్రులకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలినట్లే. రాష్ట్ర విభజన డిమాండ్ పై అధ్యయనం చేస్తున్న శ్రీకృష్ణ కమిటీకి కేంద్ర జాబితా ఒక ఆయుధంలా పనికి వస్తుందనడంలో సందేహం లేదు. దీంతో కెసిఆర్ కు ఎక్కడ లేని ఆత్మబలం చేకూరిందని చెప్పవచ్చు.
కాగా, తెలంగాణలోని 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస తిరుగులేని విజయం సాధించడంతోనే కెసిఆర్ ఎనలేని బలాన్ని సంతరించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకపోవడం, కాంగ్రెసు అభ్యర్థులు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడం తెరాసకు ఎనలేని ధైర్యాన్నిచ్చింది. కాంగ్రెసు, తెలుగుదేశ పార్టీలు నైతిక స్థయిర్యాన్ని కోల్పోయాయి. ఆ తర్వాత వెను వెంటనే సీమాంధ్ర మంత్రులు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదిక కెసిఆర్ కు ఓ ఆయుధంలా లభించింది. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడం దేశద్రోహమని సీమాంధ్ర మంత్రులు వ్యాఖ్యానించడం ఎంత అర్థరహితమే అందరికీ అర్థమయ్యే విషయమే. సీమాంధ్ర మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను మరింతగా కలిసి ఉండలేని పరిస్థితికి నెడుతాయనడంలో సందేహం లేదు. కలిసి ఉండడానికి అవసరమైన ప్రాతిపదికను సీమాంధ్ర మంత్రులు ఏర్పాటు చేయకుండా కెసిఆర్ ను, ఆయన పార్టీ తెరాసను లక్ష్యం చేసుకోవడం పెద్ద పోరపాటేనని చెప్పవచ్చు.
సీమాంధ్ర మంత్రులపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు కూడా మండిపడుతున్నారు. ఇది కూడా తెరాసకు కలిసి వస్తుంది. తెలుగుదేశం పార్టీ కన్నా కాంగ్రెసు తెలంగాణ నాయకులకే తెలంగాణ ప్రజలు కాస్తా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే తెలుగుదేశం పార్టీ పరిస్థితినే కాంగ్రెసు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏమైనా, సంస్థాగతంగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ కెసిఆర్ ముందుకు సాగుతున్నారు.