ఒయులో మావోలపై కసరత్తు?
నిజానికి, అటవీ ప్రాంతాల్లోని నక్సలైట్లను సాయుధంగా తిప్పికొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రేహౌండ్స్ ను ఏర్పాటు చేసింది. వార్ ఫేర్ కు సంబంధించిన బలగాలు అవి. రాష్ట్రంలో తప్ప మరే ప్రాంతంలోనూ ఇటువంటి బలగాలు లేవంటారు. ఉస్మానియాలో మావోయిస్టులున్నారని ఆధారాలు చూపడానికి పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణేతర పోలీసు అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇంటిలిజెన్స్ ఐజి మహేందర్ రెడ్డి అభిప్రాయాలకు వారు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదనే ప్రచారం హైదరాబాదులో సాగుతోంది. కోస్తాంధ్రకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు మాత్రమే ఈ వ్యవహారానికంతటికీ నాయకత్వం వహిస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తెలంగాణకు అనుకూలంగా మహేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే విమర్శలు గతంలో పెద్ద యెత్తున పెల్లుబుకాయి. మహేందర్ రెడ్డి తప్పుడు నివేదిక వల్లనే తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీమాంధ్ర నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా మహేందర్ రెడ్డి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. నిజానికి, మహేందర్ రెడ్డి మంచి అధికారిగా పేరుంది. పలు కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించిన మహేందర్ రెడ్డిది సమాచార సేకరణలో అందె వేసిన చేయి అంటారు. కానీ, ఆయన నివేదికలు సీమాంధ్ర నాయకులకు నచ్చకపోవడమే ఆయన పాలిట శాపంగా మారినట్లు సమాచారం.