చంద్రబాబు పని గోవిందా!
తెరాసతో పొత్తు పెట్టుకోవడం వల్లనే తాము సాధారణ ఎన్నికల్లో ఓడిపోయామని ఫలితాల అనంతరం తెలుగుదేశం థింక్ ట్యాంక్ కొండ తవ్వి ఎలుకను పట్టినట్లు ఓ అభిప్రాయానికి వచ్చింది. దాన్ని చంద్రబాబు చక్కగా, బుద్ధిపూర్వకంగా నమ్మారు. ఇప్పుడు తెలంగాణలో ఆయన రెండు విధాలుగా దెబ్బ తిన్నారు. ఒక్కటి - తెరాసతో పొత్తు లేకపోవడం. రెండోది - తెలంగాణపై యు టర్న్ తీసుకోవడం. తెలంగాణపై యు టర్న్ తీసుకోవడంతో చంద్రబాబు విశ్వసనీయత తీవ్రమైన ప్రమాదంలో పడింది. అప్పటికే చంద్రబాబు విశ్వసనీయత మీద ప్రజల్లో తీవ్రమైన అనుమానాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, సంక్షేమ పథకాలను హామీలకు విరుద్ధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తిరగదోడం వంటి కారణాల వల్ల ఆయన విశ్వసనీయత ప్రజల్లో తీవ్రంగా దెబ్బ తిన్నది. తెలంగాణ విషయంలో ఆయన మాట మార్చడంతో ఈ ప్రాంతంలో ఆయన తిరగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. అంతగా తెలంగాణ ప్రజల వైముఖ్యానికి, ఆగ్రహానికి ఆయన గురయ్యారు.
చంద్రబాబు తెలంగాణలో ఇక కోలుకోవడం అనేది భ్రమే అవుతుంది. తెలంగాణ విషయంలో కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించడం, వారికి చంద్రబాబు మార్చిన మాట దోహదపడడం తెలంగాణ ప్రజలు అనుభవంలోకి తీసుకున్నారు. తమ పార్టీ సీమాంధ్ర నాయకులను తెలంగాణ కాంగ్రెసు నాయకులు ధీటుగా ఎదుర్కున్నారు. ఆ రకంగా వారు తెలంగాణ ప్రజలకు పూర్తిగా దూరం కాలేకపోయారు. దానివల్ల తెరాసకు కాంగ్రెసు మాత్రమే పోటీ ఇవ్వగలుగుతోంది. ఈ స్థితిలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు శూన్యంగానే మారుతుందని అంటున్నారు.