వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు పని గోవిందా!

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పని అయిపోయినట్లే. బాబ్లీ డ్రామా ద్వారా తెలంగాణలో ఓట్లను సంపాదించుకుని పరువుకు దక్కించుకుందామనుకున్న ఆయన వ్యూహం బెడిసి కొట్టినట్లే ఉంది. ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆయన తన పార్టీ ఓటమిని అంగీకరించారు. బాబ్లీ వ్యతిరేక ఉద్యమం చేపట్టిన తర్వాత తాము ఉప ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దీన్నిబట్టి తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమైపోయినట్లే భావించాల్సి ఉంటుంది. పైగా, ఆ పార్టీ మూడో స్థానానికి దిగజారే పరిస్థితి దాపురించింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా తాము మూడో స్థానానికి పడిపోయామని, కానీ సాధారణ ఎన్నికల్లో పుంజుకున్నామని ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఉప ఎన్నికల్లో పడిపోయిన పార్టీ సాధారణ ఎన్నికల్లో పుంజుకోవడానికి గల కారణాలను ఆయన గుర్తించినట్లు లేదు. సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకుంది. తెరాస ఓట్ల వల్ల తెలుగుదేశం పార్టీ ఆ మాత్రం సీట్లను తెలంగాణలో సాధించగలిగిందనే పచ్చి నిజాన్ని ఆయన ఇప్పటికైనా గుర్తించాల్సి ఉంటుంది.

తెరాసతో పొత్తు పెట్టుకోవడం వల్లనే తాము సాధారణ ఎన్నికల్లో ఓడిపోయామని ఫలితాల అనంతరం తెలుగుదేశం థింక్ ట్యాంక్ కొండ తవ్వి ఎలుకను పట్టినట్లు ఓ అభిప్రాయానికి వచ్చింది. దాన్ని చంద్రబాబు చక్కగా, బుద్ధిపూర్వకంగా నమ్మారు. ఇప్పుడు తెలంగాణలో ఆయన రెండు విధాలుగా దెబ్బ తిన్నారు. ఒక్కటి - తెరాసతో పొత్తు లేకపోవడం. రెండోది - తెలంగాణపై యు టర్న్ తీసుకోవడం. తెలంగాణపై యు టర్న్ తీసుకోవడంతో చంద్రబాబు విశ్వసనీయత తీవ్రమైన ప్రమాదంలో పడింది. అప్పటికే చంద్రబాబు విశ్వసనీయత మీద ప్రజల్లో తీవ్రమైన అనుమానాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, సంక్షేమ పథకాలను హామీలకు విరుద్ధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తిరగదోడం వంటి కారణాల వల్ల ఆయన విశ్వసనీయత ప్రజల్లో తీవ్రంగా దెబ్బ తిన్నది. తెలంగాణ విషయంలో ఆయన మాట మార్చడంతో ఈ ప్రాంతంలో ఆయన తిరగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. అంతగా తెలంగాణ ప్రజల వైముఖ్యానికి, ఆగ్రహానికి ఆయన గురయ్యారు.

చంద్రబాబు తెలంగాణలో ఇక కోలుకోవడం అనేది భ్రమే అవుతుంది. తెలంగాణ విషయంలో కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించడం, వారికి చంద్రబాబు మార్చిన మాట దోహదపడడం తెలంగాణ ప్రజలు అనుభవంలోకి తీసుకున్నారు. తమ పార్టీ సీమాంధ్ర నాయకులను తెలంగాణ కాంగ్రెసు నాయకులు ధీటుగా ఎదుర్కున్నారు. ఆ రకంగా వారు తెలంగాణ ప్రజలకు పూర్తిగా దూరం కాలేకపోయారు. దానివల్ల తెరాసకు కాంగ్రెసు మాత్రమే పోటీ ఇవ్వగలుగుతోంది. ఈ స్థితిలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు శూన్యంగానే మారుతుందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X