చంద్రబాబు తుస్సు
తెలంగాణలో తిరిగే పరిస్థితి లేకపోవడంతో తెలంగాణకు సంబంధించిన విషయాలతో బయటే తెలంగాణ నేతలు ప్రచారానికి దిగారు. మహారాష్ట్ర అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టులను ఆపించడంలో కాంగ్రెసు విఫలమైందని, తాము బాబ్లీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు మద్దతివ్వలేదని అంటూ తెలుగుదేశం తెలంగాణ నాయకులు తెలంగాణ వెలుపల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కె. రోశయ్యతో భేటీ, మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్, కేంద్ర జల సంఘం అధికారులతో సమావేశం ఇందులో భాగమే. తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లకుండానే తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు ఇదే మార్గమని బహుశా తెలంగాణ తెలుగుదేశం నాయకులు భావించి ఉంటారు. బాబ్లీ, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని తెలుగుదేశం వాదిస్తూ తెలంగాణ ప్రజల మనసులను దోచేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్ప మరోటి వాంఛించని తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించే పరిస్థితి లేదు.
కాగా, కెసిఆర్ తెలంగాణవాదాన్ని తప్పు పడుతూ తెలంగాణ సాధన తమ వల్లనే సాధ్యమవుతుందని చెప్పుకోవడానికి కాంగ్రెసు తెలంగాణ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తన ప్రచారాన్ని ఎప్పుడో మొదలు పెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెసు మాత్రమే పోటీపోటీగా నిలిచే అవకాశం ఉంది. తాము తెలంగాణకు అనుకూలమని, ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు అరిచి గీపెట్టినా ఫలితం కనిపించే వాతావరణం లేదు.