ఇప్పుడు జగన్ వర్సెస్ డిఎస్

డిఎస్ కు పార్టీ అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. గతంలో దివంగత నేత, అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తెలియకుండా ఢిల్లీకి పిలిపించుకుని డిఎస్ కు పిసిసి పగ్గాలు అప్పగించడాన్ని బట్టి ఆయనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని అర్థం చేసుకోవచ్చు. జగన్ వ్యవహారంలో పైకి ఏ మాత్రం మాట్లాడకుండా తెర వెనక పావులు కదపడంలో డిఎస్ పాత్ర గణనీయంగా ఉందని అంటారు. నిజానికి, వైయస్ మరణం తర్వాత డిఎస్ ముఖ్యమంత్రి కావాల్సిందే. కాని, ఆయన శాసనసభకు గానీ శాసనమండలికి గానీ ప్రాతినిధ్యం వహించకపోవడంతో అప్పటి పరిస్థితిని బట్టి సీనియర్ అయిన రోశయ్య చేతికి పార్టీ అధిష్టానం పగ్గాలు అప్పగించింది.
డిఎస్ ముఖ్యమంత్రి పదవికి రేసులోకి రావడంతో వైయస్ జగన్ తనకు అనుకూలమైన వ్యూహ రచనకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో డిఎస్ ను ఓడించేందుకు ఆయన పథక రచన చేస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో దివంగత నేత వైయస్ అనుచరులు దండిగానే ఉన్నారు. బాజీ గోవర్దన్ వంటి రెండో తరం నాయకులు వైయస్ కు అత్యంత సన్నిహితులు. దీంతో వారి ద్వారా డిఎస్ కు వ్యతిరేకంగా వారి చేత పని చేయించేందుకు జగన్ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిఎస్ తెర మీదికి వస్తే ముఖ్యమంత్రి కావాలనే జగన్ లక్ష్యసాధన మరింత దూరం కావచ్చు.












Click it and Unblock the Notifications