వైయస్ జగన్ కు చెక్

పార్టీ అధిష్టానం రోశయ్యకు పూర్తి అండదండలు అందిస్తూ జగన్ వ్యూహాలకు ప్రతివ్యూహాల రచనలో ముందుకు సాగుతూ వస్తోంది. దీంతో క్రమక్రమంగా రోశయ్య బలపడుతూ, జగన్ బలహీనపడుతూ వచ్చారు. ఏప్రిల్ మొదటివారంలో వైయస్ జగన్ రాష్ట్ర పర్యటనను తలపెట్టారు. ఏప్రిల్ మొదటివారంలోనే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ రకంగా పార్టీ శాసనసభ్యులకు ఆశ చూపి జగన్ కు దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. వైయస్ జగన్ తన తండ్రి మరణవార్త విని మరణించినవారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆ పర్యటన తలపెట్టారు. అయితే ఇప్పుడు ఆ పర్యటన ఉంటుందా, ఉండదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. శాసనసభ్యులు, మంత్రుల సహకారం ఉంటే తప్ప అది జరిగే అవకాశం లేదు. పైగా, తెలంగాణలో ఆయనకు సహకారం అందే అవకాశం కూడా లేదు.
ఇకపోతే, తాజాగా ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సహకారం అందిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా జగన్ కు చెక్ పెట్టడమే. గనుల శాఖ డైరెక్టర్ వి రాజగోపాల్ ను ప్రభుత్వం దీర్షకాలిక సెలవుపై పంపడమే కాకుండా మరి కొంత మంది అధికారులపై కూడా ప్రభుత్వం కొరడా ఝళిపించింది. జగన్ ప్రోత్సాహంతోనే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అనంతపురంలో తన ఆగడాలను కొనసాగిస్తోందని, తనకు అనుకూలంగా అధికారులతో పనులు చేయించుకుంటోందనే ఆరోపణలున్నాయి. దీంతో జగన్ కు ఒక హెచ్చరికలా అధికారులపై చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారు.
మొత్తం మీద, వైయస్ జగన్ కు మిత్రుల కన్నా కాంగ్రెసు పార్టీలో శత్రువులే ఎక్కువగా ఉన్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. పైగా, పార్టీ అధిష్టానం నిర్ణయాలను ప్రభావితం చేసే నాయకులు చాలా మంది ఆయనకు వ్యతిరేకంగానే ఉండడం యాదృచ్ఛికమేమీ కాకపోవచ్చు.












Click it and Unblock the Notifications