జైపాల్ రెడ్డిపై నెగెటివ్ కాంపైన్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రి రోశయ్య తటస్థంగా ఉన్నారని, అయితే జైపాల్ రెడ్డి పని కట్టుకుని నిరుడు డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామనే ప్రకటన చేయించారని రోశయ్య వర్గం దుమ్మెత్తిపోస్తోంది. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడం వల్లనే రాష్ట్రం భగ్గుమంటోందని, అందుకు ప్రధాన కారణం జైపాల్ రెడ్డేనని ప్రచారం సాగిస్తున్నారు. జైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే మరిన్ని సమస్యలు తలెత్తుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.
పైగా, జైపాల్ రెడ్డికి అంత స్థాయి లేదని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆమంచి లాగా రోశయ్యకు అత్యంత సన్నిహితులైన ద్వితీయ శ్రేణి నాయకులు వడ్డే ప్రసాద్ వంటివారితో జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తాను ఎప్పుడంటే అప్పుడు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోతానని రోశయ్య అన్నా అందుకు ఆయన సుముఖంగా లేరని చెబుతున్నారు. అధిష్టానం చెప్తే దిగిపోతారనేది వేరే విషయం అయినా ప్రస్తుత పద్ధతిలోనే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే, జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.