వైయస్ భారం!

మంత్రివర్గంలో మార్పులు చేయడానికి రోశయ్య కంకణబద్దుడై ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం - వైయస్ మార్కు మంత్రివర్గానికి స్వస్తి చెప్పడమే. సమర్థులైనవారిని మంత్రివర్గంలో వైయస్ రాజశేఖర రెడ్డి చేర్చుకోలేదనేది రోశయ్య ప్రధానమైన అభ్యంతరమని అంటారు. మంత్రులు ఫైళ్లు చూడడం లేదని, చాలా మందికి శాఖలకు సంబంధించిన అవగాహన కూడా లేదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారిని చూసి వైయస్ మంత్రివర్గంలో చేర్చుకున్నారని, దానివల్ల తన ఏకఛత్రాధిపత్యం నడుస్తుందనేది ఆయన ఉద్దేశమని అంటారు. పైగా, ప్రస్తుతం సీమాంధ్ర మంత్రులు తెలంగాణలో, తెలంగాణ మంత్రులు సీమాంధ్రలో పర్యటించే పరిస్థితి లేదని, అసమర్థులతో పరిపాలన సాగించడం కష్టమని రోశయ్య సోనియాతో చెప్పినట్లు సమాచారం.
మొదటి సారి వైయస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బలహీనమైనవారిని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. తదుపరి ఎన్నికల్లో 18 మంత్రులు ఓడిపోవడం అందుకు ఉదాహరణ అని అంటారు. అలాంటి మంత్రులతో నెట్టుకు రావడం, వైయస్ బరువును మోయడమే అవుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు అవసరమని రోశయ్య భావిస్తున్నారు. సీనియర్లను చేర్చుకుని సమర్థమైన పాలన అందించడం అవసరమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. రోశయ్య వాదనతో ఏకీభవించిన అధిష్టానం చివరకు మంత్రివర్గంలో మార్పులకు అంగీకరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications