మారిన వైయస్ జగన్ ట్యూన్స్

ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలోనూ, ప్రస్తుత నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్రలోనూ ఆయన ఎవరినీ విమర్శించడం లేదు. ఎవరిపైనా నిందలు వేయడం లేదు. తన తండ్రి కార్యక్రమాలను వివరిస్తూ వెళ్తున్నారు. అది కూడా రొటీన్ గా మారిందని భావించారో ఏమో ఇటీవల విద్యార్థులను వేదికపైకి రప్పించి వైయస్ పథకాల వల్ల లబ్ధి పొందిన తీరును వారి మాటల్లోనే చెప్పించారు. ఆ రకంగా ప్రజల్లో తన తండ్రిపై ఉన్న అభిమానాన్ని ఆయన చాటదలిచారు. ఎడతెరిపి లేకుండా ఆయన చేస్తున్న ఓదార్పు యాత్ర, ప్రసంగాలు ఒక విధంగా రొటీన్ గా మారాయి. అధిష్టానంపై కామెంట్స్ చేస్తారేమోనని ఉత్కంఠతో చూసిన మీడియాకు ఆయన నిరాశనే కలిగిస్తున్నారు.
ఇదిలా ఉంటే, జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్, పత్రిక అధిష్టానంపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయడం లేదు. వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పథకాలు నీరు గారుతున్నాయంటూ మాత్రం పత్రికలో అప్పుడప్పుడూ వార్తాకథనాలు వస్తూనే ఉన్నాయి. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాష్ట్ర కాంగ్రెసు నాయకులను మాత్రం సాక్షి చానెల్ గానీ పత్రిక గానీ వదలడం లేదు. వైయస్ జగన్ వర్గానికి చెందిన చోటా మోటా నాయకుల మీడియా సమావేశాలకు కూడా ఇతోధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. వారి మీడియా సమావేశాలను సాక్షి టీవీ చానెల్ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యక్రమాల వంటివాటిని కూడా పట్టించుకోకుండా ఆ పని చేస్తోంది. అంబటి రాంబాబు, గోనె ప్రకాశ రావు, బాజిరెడ్డి గోవర్దన్ వంటి ద్వితీయ శ్రేణి నాయకులను ప్రథమ శ్రేణి నాయకుల స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది.
మొత్తం మీద, వైయస్ జగన్ వ్యూహం అధిష్టానానికి అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తూనే రాష్ట్ర కాంగ్రెసు నాయకులపై విరుచుకుపడడంగా కనిపిస్తోంది. ఓదార్పు యాత్రలో మాత్రం కాంగ్రెసు జెండాలను, సోనియా పోస్టర్లను వాడడం లేదు. జగన్ స్వతంత్ర యాత్రగా అది సాగుతోంది. వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి, చివరగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నారనేది ఇప్పుడు అత్యంత బహిరంగ విషయంగా మారిపోయింది.












Click it and Unblock the Notifications