జగన్ కు శత్రువులెవరు?

నిజానికి, వైయస్ రాజశేఖర రెడ్డి శత్రువులే జగన్ శత్రువులై ఉండాలి. వైయస్ రాజశేఖర రెడ్డి తిరుగులేని అధికారం చెలాయిస్తున్న సమయంలో నోరు మెదపని శత్రువులు ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అనుకోవచ్చు. అలాగే, తమకు అన్యాయం జరిగినా వైయస్ హయాంలో నోరు విప్పని కాంగ్రెసు నాయకులు, సీనియర్ శాసనసభ్యులు ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా గట్టిగానే మాట్లాడుతున్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెసు సీనియర్ నాయకులంతా ఒక రకంగా వైయస్ కు వ్యతిరేకంగానే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు పలుమార్లు వైయస్ ఎదుటే తన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారంతా ఇప్పుడు కూడా వైయస్ కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. కానీ జగన్ కు వ్యతిరేకంగా మాత్రం పాపులు కదుపుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అదంతా ఒక కొత్త లాబీని వైయస్ తయారు చేసుకోవడం వల్ల జరిగిన పరిణామంగానే చూడాల్సి ఉంటుంది.
అయితే, జగన్ గుర్తించని విషయం ఏమిటంటే - ఆయనకు అన్ని వేళలా అండదండలు అందించిన కొంత మంది జూనియర్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కూడా తనకు దూరమవుతున్నారనే విషయాన్ని. దానం నాగేందర్, రాంరెడ్డి వెంకటరెడ్డి వంటి మంత్రుల మాటల్లో తేడా వచ్చింది. ఓదార్పు యాత్ర వద్దనే అధిష్టానం మాటను జగన్ వినాల్సి ఉండిందనేది వారి అభిప్రాయం. వైయస్ కు రక్షణ కవచంలా నిలిచిన కాంగ్రెసు జూనియర్లంతా ఇప్పుడు జగన్ వైపు ఉంటారనేది కూడా భ్రమే అవుతుంది. ఇందుకు కారణం వైయస్ జగన్ వ్యూహం, అనుసరిస్తున్న వైఖరే కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు జగన్ అసలు శత్రులు ఆయన తొందరపాటేనని చెప్పాలి. అధికారం కోసం ఆయన సహనాన్ని ప్రదర్సించడం లేదు. ఓపికగా రాజకీయాలను నడిపి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే వ్యూహంతో కాకుండా ఏదో రీతిలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలనే తొందరపాటే అతని ప్రధాన శత్రువుగా మారింది.












Click it and Unblock the Notifications