జగన్ ఉడుంపట్టు
తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులు, పార్లమెంటు సభ్యులు, కొంత మంది శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నా, వద్దంటున్నా ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏదో విధంగా పార్టీ అధిష్టానం అనుమతి పొందాలనేది ఆయన ఎత్తుగడగా కూడా కనిపిస్తోంది. జగన్ సాక్షి దినపత్రికలో వస్తున్న వార్తాకథనాలు కూడా ఇదే విషయాన్ని పట్టిస్తున్నాయి. జగన్ ఎవరికి కూడా భయపడదలుచుకోలేదు. ఎంతటివారైనా ప్రత్యర్థులను ఎదుర్కోవడానికే ఆయన సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై సాక్షిలో వచ్చిన వార్తాకథనాన్ని బట్టి ఈ విషయం అర్థమవుతోంది. డిఎస్ కు అధిష్టానం వద్ద వ్యతిరేకత తప్పలేదని సాక్షిలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది.
వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడే జగన్ తనదంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీలో సీనియర్లకు పోటీగా జూనియర్లను సిద్ధం చేశారు. జూనియర్ నాయకులు జగన్ అండదండలతో సీనియర్లను ఎదుర్కుని ఎదగాలనే ఉద్దేశంతో జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ జగన్ వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రపై పట్టు పడుతుండడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
మొత్తం మీద, జగన్ రాష్ట్రవ్యాప్తంగా తనదంటూ ఓ బలమైన లాబీని తయారు చేసుకుని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన సత్తాను సాధించుకున్నట్లు రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి.