తెలంగాణపై సోనియా తేలుస్తారా?

Telangana
తెలంగాణ అంశాన్ని జూన్ మొదటివారంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తేలుస్తారా అనే అంశంపై వేడివేడిగా చర్చ జరుగుతోంది. జూన్ మొదటి వారంలో తెలంగాణ అంశాన్ని తేల్చాల్సిందేనని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామాలకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు తెలంగాణ జెఎసి గడువు పెట్టాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. ఆ స్థితిలో సోనియా ఏదైనా నిర్ణయానికి వస్తారా అనే ఉత్కంఠ చోటు చేసుకుంది. తెలంగాణ అంశాన్ని నానిస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ కన్నా తెలంగాణ ఇప్పుడు అధిష్టానానికి అసలు సమస్య అని అంటున్నారు.

జూన్ మొదటి వారంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సిద్ధపడుతున్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి కూడా దానికి రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సమస్యను నానిస్తే పార్టీ నష్టపోతుందని వారు కూడా అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ సమస్యను సత్వరమే తేల్చాలని మాత్రం కోరుతున్నారు. అందువల్ల కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ సమస్యను జూన్ మొదటివారంలో పరిష్కరించవచ్చునని నమ్ముతున్నారు.

కాగా, కాంగ్రెసు అధిష్టానం కదలికలు మాత్రం అనుమానాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి, స్పీకర్, పిసిసి అధ్యక్ష పదవులను జూన్ మొదటి వారంలో భర్తీ చేసే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ సమస్యను నానుస్తున్నట్లే ఈ పదవుల భర్తీని కూడా కాంగ్రెసు అధిష్టానం నానుస్తోంది. ఆ పదవులను భర్తీ చేయడం ద్వారా కాంగ్రెసు తెలంగాణ నాయకులను బుజ్జగించే ప్రయత్నాలను అధిష్టానం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయంలో పదవులను ఇచ్చి తెలంగాణ ఉద్యమ ఉధృతిని తగ్గించడమనే సూచన కూడా ఉంది. దీన్నే కాంగ్రెసు అధిష్టానం అమలు చేస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అదలా వుంటే, ఎస్ జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కాంగ్రెసు పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడుతారనే వార్తలు వస్తున్నాయి. తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌ను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెసు వ్యూహంలో భాగంగా జైపాల్ రెడ్డి వస్తున్నారని అంటున్నారు. జైపాల్ రెడ్డి అలా వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను కాంగ్రెసు అధిష్టానం అటక ఎక్కించే పరిస్థితే ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో పట్టు సాధిస్తే కాంగ్రెసుకు ఢోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా, తెలంగాణపై సోనియా గాంధీ కపట ధోరణినే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+