తెలంగాణపై జగన్ గోడ మీది పిల్లివాటం?
అయితే ఎస్సీ వర్గీకరణపై ఓ నిర్ణయం తీసుకున్నప్పటికీ తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. శుక్రవారం ప్లీనరీ ప్రాంగణంలో ఆ పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ తెలంగాణ అంశం చాలా సెంటిమెంటుతో కూడుకున్నదని, తెలంగాణపై జగన్ ఈ ప్లీనరీలోనే నిర్ణయం తీసుకోవాలని ఇటు సీమాంధ్ర ప్రజలు, అటు తెలంగాణ ప్రజలు కోరుతుండవచ్చు. ఈ ప్లీనరీలోనే నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పలేదు. అంతేకాదు. తెలంగాణ అంశానికి సంబందించి కాంగ్రెసు పార్టీ, యుపిఏ పూర్తి బాధ్యత వహించాలని ఆయన సూచించారు.
తెలంగాణపై జగన్ నిర్ణయం తీసుకుంటే సమస్య పరిష్కారం కాదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ తెలంగాణకు ఓకే అంటే తెలంగాణ రావడమో, కాదంటే తెలంగాణ రాకపోవడమో జరగదని అందుకే వైయస్సాఆర్ పార్టీ నిర్ణయానికి అంత ప్రాధాన్యత లేదని ఆయన చెప్పారు. అంటే ఈ ప్లీనరిలో తెలంగాణపై తాము నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పకనే చెప్పినట్లుగా కనిపిస్తోంది. పైగా, వైయస్ జగన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, వైయస్సార్ కాంగ్రెసులోకి రావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి రాష్ట్ర విభజనకు పూర్తి వ్యతిరేకులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ వారు పలు సందర్భాల్లో మాట్లాడిన ఉదంతాలున్నాయి. అందువల్ల తెలంగాణకు అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. అయితే, తెలంగాణపై జగన్ ఏం చెబుతారో రేపు (శనివారం) తేలుపోతుంది.