ఫలిస్తున్న కెసిఆర్ రాజకీయ వ్యూహం

కాంగ్రెసుకు చెందిన ముగ్గురు శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరడానికి సిద్దమయ్యారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం జాప్యం చేసే కొద్దీ నష్టం పెరిగే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో తన బలాన్ని, పార్టీ బలాన్ని పెంచుకునే వ్యూహానికి కెసిఆర్ పదును పెడుతూ వస్తున్నారు. తెలంగాణపై చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను ఆయన ప్రోత్సహించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి ఆరుగురు శాసనసభ్యులు రాజీనామా చేశారు. మరింత మంది తెరాస వైపు అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెసు పట్ల కెసిఆర్ మెతకవైఖరి అవలంబిస్తున్నారనే తెలుగుదేశం పార్టీ విమర్శలకు కూడా సమాధానం లభించే పరిస్థితి ఉంది. తెలంగాణపై నిర్ణయం తీసుకునే విషయంలో రేపూ మాపూ అంటూ జాప్యం చేస్తూ వస్తున్న కాంగ్రెసును కూడా కెసిఆర్ లక్ష్యం చేసుకోవడానికి నిర్ణయించుకోవడమే తరువాయి వలసలు ప్రారంభమయ్యాయి. సోమారపు సత్యనారాయణ, రాజయ్య, జూపల్లి కృష్ణారావు కాంగ్రెసు పార్టీకి రాజీనామాలు చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే విషయంలో కేంద్రం ఎంతగా జాప్యం చేస్తే అంతగా కెసిఆర్ లాభపడే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లోనే కాకుండా ఎన్నికలు వచ్చే లోగానే బలాన్ని పెంచుకునేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల, ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల శానససభ్యులను పార్టీలోకి ఆహ్వానించి, ఉప ఎన్నికలు జరిగేలా చూసి బలాన్ని పెంచుకోవడంలో ఆయన నిమగ్నమయ్యారు. అది ఫలితం ఇస్తున్నట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications