కెసిఆర్ను టార్గెట్ చేసిన సీమాంధ్ర నేతలు
కాగా, కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు జోగి రమేష్ కెసిఆర్ కుటుంబ సభ్యులపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాకపోతే కెసిఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరు ముందు తాగుతారో చెప్పాలని ఆయన సోమవారం విజయవాడలో డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. దళితులను, బడుగులను, బలహీన వర్గాల ప్రజలను బలి చేయాలని కెసిఆర్ చూస్తున్నారని ఆయన విమర్శించారు.
కెసిఆర్ నమ్మదగిన నాయకుడు కాడని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. కెసిఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రతి మాట వెనక కూడా స్వార్థం ఉంటుందని ఆయన అన్నారు. కాగా, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు కూడా కెసిఆర్పై విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో కలిసి కెసిఆర్ రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వైయస్ జగన్ ప్లీనరీ కోసం కెసిఆర్ రైల్రోకోను రద్దు చేసుకున్నారని, తాము ధర్నా చేపడితే రాస్తారోకోలకు పిలుపునిచ్చారని, తమ ధర్నాకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకే అలా చేశారని తెలుగుదేశం మరో తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.