జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు?

వైయస్ జగన్ తన వెంట నడుస్తున్న శాసనసభ్యులకు ఏ విధమైన దిశానిర్దేశం చేయడం లేదని అంటున్నారు. శానససభ్యులను ఆలా వదిలేసి ఆయన పార్టీ కమిటీలను ప్రకటించారు. శానససభ్యులకు ఈ కమిటీల్లో స్థానం కల్పించలేదు. కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యులకు పార్టీ కమిటీల్లో స్థానం కల్పిస్తే సమస్య ఎదురవుతుందనే విషయం అందరికీ తెలుసు. ఇదే సమయంలో జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకునే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు లేదు. నలుగురికైతే షోకాజ్ నోటీసులు జారీ చేసింది గానీ వారిపై కూడా చర్యలు తీసుకోలేదు.
జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులు కొంత మంది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మధ్య మధ్యలో కలుస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి వంటి కరుడు గట్టిన జగన్ విధేయులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. అయితే, తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైయస్ జగన్ వెంటే ఉంటానని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం పడిపోవాలనే ఆతురతతో మాత్రం వైయస్ జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తగిన బలం తనకు లేదనే విషయం జగన్కు తెలుసు. అందుకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని రెచ్చగొడుతున్నారు. అయితే, చంద్రబాబు ఇప్పుడిప్పుడే అందుకు సిద్ధంగా లేరు.
జులై 8వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు ప్లీనరీ సమావేశం ఉంది. ఈ ప్లీనరీ సమావేశంలో పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణం జరుగుతుందని అంటున్నారు. ఈలోగా తన వెంట నడుస్తున్న శాసనసభ్యులకు జగన్ దిశానిర్దేశం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications