జగన్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గుతున్నారా?

విచారణ ప్రక్రియ పూర్తవటానికి సుదీర్ఘ సమయమే పట్టేలా ఉంది. ఎమ్మెల్యేలు చేజారిపోతారేమోనన్న ఆందోళన జగన్ సన్నిహితుల్లో నెలకొంది. ఎలాగోలా వెంటనే రాజీనామాలు ఆమోదించేలా చూసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి ఆదివారం నాటి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం మీద రాజీనామాల ఆమోదంపై ఎమ్మెల్యేల ఆంతర్యమేంటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాలపై స్పీకర్ విచారణ వేగం పుంజుకుంటోంది. శనివారం కాగా సాయంత్రం తొలుత మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, తరువాత రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డిలతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఒక్కొక్కరిని విడిగా పిలిచి 40 నిమిషాలపాటు ఏకాంతంగా వారితో మాట్లాడారు. శాసనసభ కార్యదర్శి, స్టెనోగ్రాఫర్లు కూడా వారితో లేరని తెలిసింది. విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్యేలు ఏం మాట్లాడిందీ చెప్పేందుకు నిరాకరించారు. రాజీనామాకి కట్టుబడి ఉన్నారా అని బాలనాగిరెడ్డిని కలిసిన విలేకరులు ప్రశ్నించగా... మౌనం వహించారు. ''స్పీకర్ పిలిచారు... వచ్చాను. ఆయన అడిగిన దానికి జవాబిచ్చాను. ఆయన నిర్ణయాన్ని వెలువరించాక స్పందిస్తా'' అని వివరించారు.
రాజీనామా చేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేలంతా కలిసి ''ఈ నెల 5, 6 తేదీల్లో స్పీకర్ని కలవాలని భావిస్తున్నట్లు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు కదా... మీరు కూడా వారితో కలుస్తారా?'' అని ప్రశ్నించగా తనకలాంటి సమాచారం ఏదీ లేదన్నారు. స్పీకర్తో ఏం మాట్లాడారని పదేపదే అడగగా... ఏమీ వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు. తెదేపాలో కొనసాగాలని భావిస్తున్నారా అని ప్రశ్నించగా... మీకంతా తెలుసని బదులిచ్చారు. అనంతరం రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డిని రాజీనామాకి కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించగా... చేశాక కట్టుబడి ఉండాలి కదా అని బదులిచ్చారు. స్పీకర్తో జరిగిన సమావేశం వివరాల్ని బయటికి వెల్లడించకూడదని చెప్పారు. శాసనసభా ప్రాంగణంలో ఈ విషయాలు అసలే మాట్లాడకూడదని, ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పారు. 5, 6 తేదీల్లో మిగిలిన ఎమ్మెల్యేలతో కలిసి మరలా స్పీకర్ని కలిసే విషయం తనకు తెలియదని చెప్పారు.
కాగా జగన్ వర్గానికి చెందిన జమ్మలమడుగు, రాజంపేట ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, ఆకేపాటి అమరనాధ్రెడ్డిలు సమర్పించిన రాజీనామాలపై విచారణ నిమిత్తం సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం నోటీసులు పంపారు. అనంతరం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి నోటీసులిస్తారు. ఆ తరువాత మిగిలిన వారిని పిలుస్తారు. ఇక్కడితో తొలి విడత విచారణ పూర్తవుతుందని, అప్పటికి ఒక అవగాహనకు రావచ్చని... అనంతరం మిగిలిన వారిని పిలవాలని అనుకుంటున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications