వివేకాకు జగన్ భయపడ్డారా?

నిజానికి ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టి అధికారాన్ని కైవసం చేసుకోవాల్సింది. పులివెందులలో తాను పోటీ చేస్తే వైయస్ వివేకానంద రెడ్డి అడ్డం వచ్చి, తనపై పోటీ చేసినా ఆశ్చర్యం లేదనే విషయం ఆయనకు తెలుసు. ఈ విషయమై వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ కు సవాల్ విసిరినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే కనుక జరిగితే రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీపై దాని ప్రభావం పడే ప్రమాదం ఉందని జగన్ గ్రహించినట్లున్నారు. పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో వైయస్ వివేకానంద రెడ్డికి మంచి పేరుంది. అన్న రాజశేఖర రెడ్డికి లక్ష్మణుడిలా తోడున్నాడనే ప్రచారమూ ఉంది. ఇది వైయస్ జగన్ కు కష్టాలు తెచ్చి పెట్టవచ్చు. బాబాయ్ వివేకాను పులివెందుల ఉప ఎన్నికకు దూరంగా ఉంచడానికే వైయస్ జగన్ తాను కడప పార్లమెంటు సీటు నుంచి పోటీ చేస్తానని, అమ్మ విజయమ్మ పులివెందుల నుంచి శాసనసభకు పోటీ చేస్తారని చెప్పినట్లు తెలుస్తోంది.
వైయస్ విజయలక్ష్మి సానుభూతి ద్వారా పులివెందుల నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఆమె పోటీ చేస్తే వైయస్ వివేకానంద రెడ్డి గౌరవ భావంతో అంత దూకుడుగా పులివెందులలో పని చేయకపోవచ్చునని అంటున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి నుంచి పోటీని నివారించి నెట్టుకురావడానికే వైయస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మరో మాట కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెట్టాలనేది కూడా జగన్ అనుకుంటున్నారట. సాధారణ సభ్యుడిగా శాసనసభలో కూర్చోవడం ఆయనకు ఇష్టం లేదని చెబుతున్నారు. దీనివల్ల ఏకంగా మధ్యంతర ఎన్నికలను తెచ్చిపెట్టి శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలోనే కాలు పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఇప్పుడు ఆయన పులివెందుల నుంచి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications