ఎన్టీఆర్కు ఓకే: వైయస్కోసం జగన్ డిమాండ్, చిక్కే!
విగ్రహ నమూనాను ఆమోదించడంతో పాటు విగ్రహం ఇవ్వాలంటూ కేంద్రమంత్రి పురంధేశ్వరికి లోకసభ స్పీకర్ మీరా కుమార్ బుధవారం లేఖ రాశారు. ఎన్టీఆర్ విగ్రహం తర్వాత ఇప్పుడు కొత్త డిమాండ్ తెర పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ డిమాండ్ కాంగ్రెసు అధిష్టానాన్ని చిక్కుల్లో కూడా పడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత వైయస్ రాజశఖర రెడ్డి విగ్రహ ఏర్పాటుకు డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు పార్లమెంటు పచ్చజెండా ఊపే వరకు ఆగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తమ డిమాండ్ను తెర పైకి తీసుకు రావచ్చునని అంటున్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం కోసం టిడిపి డిమాండ్ చేసింది. కాంగ్రెసులో ఉన్న పురంధేశ్వరి కూతురు కాబట్టి ప్రయత్నాలు చేసింది. అయితే అధికార కాంగ్రెసు పార్టీ నుండి ఎలాంటి డిమాండ్ రాలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ టిడిపి వ్యవస్థాపకులు కాబట్టి.
కానీ వైయస్ విషయంలో మాత్రం కాంగ్రెసు చిక్కుల్లో పడే అవకాశాలు ఉండవచ్చునని అంటున్నారు. వైయస్ విగ్రహం మేం ఇస్తామని, పార్లమెంటులో ఏర్పాటు చేయాలని జగన్ డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే జగన్కు రాష్ట్ర కాంగ్రెసు నేతలు వంత పాడాల్సి ఉంటుందంటున్నారు. వైయస్ కాంగ్రెసు సిఎంగా పని చేశాడు. ఇప్పటి వరకున్న అత్యుత్తమ ముఖ్యమంత్రులో వైయస్ ముఖ్యమైనవాడని, ఆయన తమ వాడేనని కాంగ్రెసు చెబుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో జగన్ డిమాండుకు వారు కూడా మద్దతు పలకాల్సి ఉంటుంది. లేదంటే వైయస్సార్ కాంగ్రెసు వారిని ప్రశ్నించే అవకాశం ఉంది. వైయస్ను తమ పార్టీ నేతగా చెప్పుకున్న కాంగ్రెసు పార్లమెంటులో ఆయన విగ్రహం కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదని వైయస్సార్ కాంగ్రెసు ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఇప్పటికే సిబిఐ ఛార్జీషీటులో ఆయన పేరును పెట్టడాన్ని వ్యతిరేకించక పోవడాన్ని జగన్ పార్టీ ప్రశ్నిస్తోంది. మరోవైపు పురంధేశ్వరిని టిడిపి పలుమార్లు నిలదీసిన సందర్భాలు కూడా మనం చూశాం.