బాబు ఎఫెక్ట్: '14 తర్వాతే కాంగ్రెస్లోకి జగన్!
అయితే ఇప్పుడు అదే లాలూచి పదం రివర్స్ అయి జగన్ పార్టీని ఇబ్బందులలోకి నెట్టిందని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి సహా పలువురు ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విజయమ్మ ఢిల్లీ వెళ్లి తన తనయుడి కోసం సోనియాను అర్థించిన మాట ఖచ్చితంగా నిజమని టిడిపి చెబుతోంది. వీరిద్దరు కలుసుకున్నారని ఓ ఆంగ్ల దిన పత్రికలో వచ్చిన కథనం జగన్ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టేసింది. జగన్ కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనేందుకు పలు ఆధారాలు బహిరంగంగా కనిపిస్తున్నాయని విపక్షాలు అంటున్నాయి. విజయమ్మ ఢిల్లీ పర్యటన తర్వాత జగన్ కేసు విషయంలో కేంద్రంలో మార్పు కనిపిస్తోందని, అందుకే అప్పటి నుండి సిబిఐ దర్యాఫ్తులో వేగం తగ్గిందని విమర్శిస్తున్నారు.
కేసును మాఫీ చేయలేరు కాబట్టి విచారణనను చాలా నెమ్మదిగా చేస్తారని, తద్వారా జగన్ లబ్ధి పొందుతారని అంటున్నారు. కేసును నెమ్మదిగా విచారించడం, జగన్ను బయటకు తీసుకు రావడం వంటి ఒప్పందాలతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి ఓటేసిందని విమర్శిస్తున్నారు. జగన్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెసులో కలుస్తుందని టిడిపి కుండ బద్దలు కొడుతోంది.
అయితే కాంగ్రెసులో కలిసే విషయమై జగన్తో పాటు కాంగ్రెసు పెద్దలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. జగన్ ఎలాగూ పార్టీ నుండి బయటకు వెళ్లాడని, కాబట్టి ఇప్పుడు ఆయన తన పార్టీని కాంగ్రెసులో కలిపితే ఇరువురికి నష్టమేనని, తద్వారా తెలుగుదేశం పార్టీ బలపడుతుందని భావిస్తున్నారని అంటున్నారు. పైగా ఇన్నాళ్లూ కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కయ్యాయని చెప్పిన కొద్ది రోజుల్లోనే కలిస్తే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుండవచ్చునని అంటున్నారు.
ఇక కాంగ్రెసు కూడా జగన్ ఇప్పుడు కలిసేకంటే 2014 సాధారణ ఎన్నికల తర్వాత కలిస్తేనే బాగుంటుందని భావిస్తున్నారట. తద్వారా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టిడిపిని మట్టి కరిపించ వచ్చునని భావిస్తున్నారట. కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసులు 2014 వరకు విడిగా ఉండి పోటీ చేస్తే ఇరు పార్టీలే తొలి రెండు స్థానాలలో ఉంటాయని, అప్పుడు టిడిపి మూడో స్థానానికి దిగజారి మరింత ఆ పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని లెక్కలు వేస్తున్నారని అంటున్నారు. అందుకే ఇప్పటి కంటే ఆ తర్వాత జగన్ కాంగ్రెసులో చేరితేనే బావుంటుందని ఇరు పార్టీల వారు భావిస్తున్నార.
అంతేకాకుండా 2014లో ఒంటరిగా పోటీ చేసి అత్యధిక సీట్లు గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెసుతో రాజీ కుదుర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని, ఆ పార్టీతో ఇప్పుడే కలిస్తే పీఠం గొడవ మళ్లీ మొదటికి వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభిప్రాయపడుతుండవచ్చునని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెసులో 2014లో సిఎం పీఠంపై చిరంజీవి, బొత్స సత్యనారాయణలు కన్నేశారు.