జగన్వైపు ఎమ్మెల్యేలు: కౌంటర్ స్కెచ్చేసిన బాబు
అయితే పార్టీని వీడేందుకే విమర్శలు చేస్తున్న వారిని మాత్రం చంద్రబాబు ఏమాత్రం ఉపేక్షించడం లేదని చెబుతున్నారు. వారంతట వారే పార్టీని విడిచి వెళ్లేందుకు బాబు స్కెచ్ వేస్తున్నారట. విమర్శలు చేస్తే వేటు వేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన బాబు వారి దారిలోనే కౌంటర్ స్కెచ్ వేస్తున్నారట. వెళ్లాలనుకునే వారు ప్రధానంగా బాబునే టార్గెట్ చేసుకుంటున్నారు. అలాంటి వారిపై వేటు వేయకుండా వారంతట వారే పార్టీని వీడేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారట.
ఇటీవల తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలు తెలంగాణపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాసినందుకు నిప్పులు చెరిగారు. బాబు వల్లనే టిడిపి ఇలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వారు తెలంగాణపై బాబు లేఖ రాసినందుకు విమర్శలు చేయలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం దానిని ఉపయోగించుకొని వారు బాబును టార్గెట్ చేశారు. వారు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు మానసికంగా ఎప్పుడో సిద్ధమయ్యారు.
కానీ పార్టీ మారడానికి వారికి సందర్భం రాలేదు. చంద్రబాబు తెలంగాణపై లేఖ రాయగానే వారు దానిని ఉపయోగించుకొని బాబుపై విమర్శలు గుప్పించారు. వారు ఘాటు వ్యాఖ్యలే చేశారు. కానీ టిడిపి వెంటనే వారిపై స్పందించలేదు. జగన్ను, ఆయన కుటుంబాన్ని స్వయంగా కలిసిన సంకినేని వెంకటేశ్వర రావు, మైసూరా రెడ్డిలపై వెంటనే వేటు వేశారు. కానీ ప్రవీణ్, అమర్నాథ్లు పార్టీని వీడకుండా, వైయస్సార్ కాంగ్రెసును కలవకుండా వేటు వేయించుకొని వెళితే మరింత లబ్ధి ఉంటుందని భావిస్తున్నారట.
ఇది గుర్తించిన చంద్రబాబు వారిపై వేటు వేయకుండా టిడిపి వైపు ప్రజలు మరింత మొగ్గు చూపేలా వారిపై వెంటనే వేటు వేయకుండా వ్యూహాత్మకంగా వ్యహరించారని చెబుతున్నారు. వేటు వేస్తే సానుభూతి పెరుగుతుంది, వారంతట వారే వెళితే టిడిపికి ఆయా నియోజకవర్గాల్లో లాభం ఉంటుందని ఆ పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. అందుకే బాబు వారంతట వారే బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు.