తెలంగాణ: బాబు, జగన్ల వైఖరి స్పష్టమేనా?
ఇది తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలకు మింగుడు పడని అంశంగానే చెప్పవచ్చు. మొత్తానికి బాబు తెలంగాణ ఎంట్రీ చిన్న చిన్న సంఘటనలు మినహా బాగానే జరిగిందని చెప్పవచ్చు. బాబు స్వేచ్ఛగా తెలంగాణలో అడుగు పెట్టడం వైయస్సార్ కాంగ్రెసుకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా తెలంగాణలో అడుగిడనున్నారు. అయితే ఇప్పుడు జగన్, బాబులు తెలంగాణపై స్పష్టంగా ఉన్నారా అనే ప్రశ్న మరోసారి తలెత్తుతోంది.
ఇటీవల పలుమార్లు చంద్రబాబు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతున్నారు. అయితే టిఆర్ఎస్, జెఏసి మాత్రం తెలంగాణకు అనుకూలమా లేదా చెప్పమని ప్రశ్నిస్తున్నారు. బాబు చెప్పే దాంట్లో స్పష్టత లేదని వారు చెబుతున్నారు. అనుకూలమా కాదా చెప్పమంటే ఎటూ తేల్చకుంటా వ్యతిరేకం కాదని బాబు చెప్పడం కేవలం రాజకీయ వ్యూహాత్మకమే. వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా బాబు క్లారిటీ ఇవ్వలేదనే చెప్పవచ్చు.
అయితే మరికొందరి వాదన ఇంకోలా ఉంది. చంద్రబాబు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతున్నారని, ఇరు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓ పార్టీ అధినేతగా ఆయనకు ఉంది కాబట్టి అలా చెబుతున్నారంటున్నారు. వ్యతిరేకం కాదని చెప్పడమంటే ప్రతిపక్ష నేతగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పినట్లేని, కేంద్రం అఖిలపక్షం పెట్టినప్పుడు ఆయన వైఖరి తెలుస్తుందని చెబుతున్నారు. తాను వ్యతిరేకం కాదని చెప్పినందు వల్ల బాబును ప్రశ్నించలేమని, ఇప్పుడు కాంగ్రెసునే అఖిలపక్షం కోసం టార్గెట్గా పెట్టుకోవాల్సి ఉంటుందంటున్నారు.
అఖిలపక్షం పెడితే బాబు వైఖరి తెలిసిపోతుందని, అప్పుడు బాబు అనుకూలమా వ్యతిరేకమా తెలుస్తుందని, వ్యతిరేకమైతే బాబును టార్గెట్గా పెట్టుకోవచ్చునని చెబుతున్నారు. తాను తెలంగాణపై తేల్చేందుకు అధికారంలో లేనని బాబు చెబుతున్నారని, ఆ వాదన కూడా సరైనదేనని, అఖిలపక్షం పెట్టిన తర్వాతనే బాబును నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి ఇప్పుడు అఖిలపక్షానికి కేంద్రాన్ని డిమాండ్ చేయవల్సిన బాధ్యత తెలుగుదేశం, టిఆర్ఎస్, బిజెపి సహా ఇతర పార్టీలపై ఉందని చెబుతున్నారు.
తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తెరాసతో కలిసి జెఏసి పని చేయడం సరైనదే అయినప్పటికీ కాంగ్రెసుతో పని చేయడాన్ని టిటిడిపి ప్రశ్నిస్తోంది. టిటిడిపి రాజీనామా చేసినా తెలంగాణ రాదని, కానీ అదే కాంగ్రెసు ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ రాజీనామా చేస్తే కాంగ్రెసు పార్టీ అధిష్టానం దిగి రావడం ఖాయమని చెబుతున్నారు. జెఏసి రాజీనామాలకు పిలుపునిస్తే తాము సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెసు ప్రజాప్రతినిధిలు సిద్ధమా అని టిటిడిపి నేత కడియం శ్రీహరి ప్రశ్నించారు.
తమ రాజీనామాలతో ఒరిగేదేమీ లేకున్నప్పటికీ జెఏసి తమను టార్గెట్గా చేసుకుందని, అదే కాంగ్రెసు నేతలు రాజీనామా చేస్తే క్షణాల్లో తెలంగాణ తేలిపోతుందని, కానీ వారితోనే జెఏసి కలిసి ఉద్యమించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అయితే తాము టిడిపినో మరో పార్టీనో లక్ష్యంగా పెట్టుకోలేదని, తెలంగాణ కోసం పని చేసే ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమని జెఏసి చెబుతోంది. తెలంగాణకు వ్యతిరేకమని నాన్చడం కాకుండా స్పష్టమైన వైఖరి ఇవ్వాలని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా తెలంగాణపై తేల్చడం లేదని చెబుతున్నారు. తాము ఇచ్చే స్థితిలో, తెచ్చే స్థితిలో లేమని చెప్పడం కాకుండా అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం తాము తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని చెబుతూనే పార్టీ వైఖరిని మాత్రం తేల్చలేకపోతుంది. అయితే బాబు, జగన్ వైఖరి తేలి, వారిని నిలదీయాలంటే అఖిలపక్షానికి డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఇదిగో తెలంగాణ అదిగో తెలంగాణ అంటున్న కెసిఆర్ను కూడా జెఏసి ప్రశ్నించాల్సిన అవసరముందని చెబుతున్నారు.