ఆలస్యంవల్లే జగన్ గెలుపు: అంచనాలు తారుమారు

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ సోమవారానికి ఢిల్లీకి రానున్నారు. ఆయన వచ్చాక పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు చేయిదాటకముందే ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలనే దిశగా వ్యూహం రచిస్తున్నారు. పద్దెనిమిది స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెసు పార్టీ అంతర్మథనం చెందుతోంది. ఎక్కడ తప్పులో కాలేశామో తెలుసునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెసుకు రెండు చోట్ల నెగ్గిన ఆనందం కంటే 16 చోట్ల ఘోర పరాజయమే బాధిస్తోంది.
ఉప ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా రావని, పోటీ తీవ్రంగా ఉంటుందని కాంగ్రెసు నేతలు వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి. ఈ ఫలితాలు పార్టీతోపాటు వ్యక్తిగతంగా తనకూ ఎదురు దెబ్బే అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారట. జగన్ పార్టీకి ప్రాంతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా ఓట్లు పడ్డాయని, దీనికి కారణాలను విశ్లేషించాల్సి ఉందని కాంగ్రెస్ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఈ ఫలితాలపై లోతైన విశ్లేషణ జరగాల్సిందేనని చెబుతున్నారు.
పార్టీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం దూరం కావడం కాంగ్రెస్ను బాగా కలవరపరుస్తోంది. దీంతోపాటు ఇందిరాగాంధీ కాలం నుంచి ఓటుబ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు చెల్లా చెదురు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వీరిని మళ్లీ దగ్గరికి చేర్చుకోవడం ఎలా అనే దానిపై అంతర్మథనం సాగుతోంది. స్థానికంగా ఆయా సామాజికవర్గాలకు చెందిన వారితో మమేకమై... పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యామని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. పార్టీని నమ్ముకుని సేవలు చేస్తున్న వారిని గుర్తించి నామినేటెడ్ పదవులను కట్టబెడితే... కార్యకర్తల్లో ఉత్సాహం నిండేదని కొందరు పేర్కొంటున్నారు.
ఇదే సమయంలో ఎరువుల ధరలు పెరగడం, రైతులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, పెట్రోలు ధరల పెంపు, మండుతున్న నిత్యావసరాల ధరలు, కరెంటు కోతలు కాంగ్రెసును దెబ్బ తీశాయని, అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, వైయస్ విజయమ్మ, షర్మిలల కన్నీళ్ల ప్రచారం ప్రజలలో సానుభూతి ఓట్లకు ఆస్కారం కల్పించిందని భావిస్తున్నారు. జగన్ విషయంలో మొదటి నుండి దూకుడుగా వ్యవహరించకుండా ఉప ఎన్నికల సమయంలోనే ఎదురు దాడికి దిగడం నష్టం కలిగించడంతో 2014 ఎన్నికల కోసం ఇప్పటి నుండే సమాయత్తం కావాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications