సేఫ్సైడ్లో జగన్: మంత్రుల గిలగిల, చిక్కుల్లో కిరణ్
కాంగ్రెసును వీడి సొంత కుంపటి పెట్టి రాష్ట్రంలో తమకు ముచ్చెమటలు పట్టిస్తున్న జగన్ను దెబ్బ తీసేందుకు ఢిల్లీ పెద్దలు అతనిపై సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించారనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపణ. దర్యాఫ్తు ప్రారంభించిన సిబిఐ ఎన్నో కోణాలను ఈ కేసులో వెలికి తీసింది. జగన్ మీడియా ఆస్తులను ఫ్రీజ్ చేసింది. జగన్తో సహా మరో ఇద్దరిని అరెస్టు చేసింది. జగన్ అరెస్టు వైయస్సార్ కాంగ్రెసులో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. అయితే విజయమ్మ పార్టీ బాధ్యతలు చేపట్టి జగన్ను మరిపించారు.
సిబిఐ వరుసగా ఛార్జీషీట్లు దాఖలు చేసుకుంటూ వెళ్తోంది. ప్రతి ఛార్జీషీట్లోనూ జగన్ పేరును ఎ-1గా పేర్కొంటూనే అందుకు కారణమైన వారిని ఛార్జీషీట్లో పొందుపరుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టయ్యారు. మరో మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదించాల్సి ఉంది. జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అరెస్టు తర్వాత అధికారులు, వ్యాపారవేత్తలు, మంత్రుల వైపు సిబిఐ దృష్టి సారిస్తోంది.
దీంతో ఇప్పుడు కిరణ్ కేబినెట్ గందరగోళంలో పడింది. మోపిదేవి అరెస్టు తర్వాత ఏ మంత్రి అరెస్టవుతారనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తోంది. అది ధర్మాన కావొచ్చునని లేదా మరొకరు కావచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా సిబిఐ తమ వైపు దృష్టి సారించడంతో మంత్రులు తమను తాము రక్షించుకునే ప్రయత్నాలు మునిగి పోయారు. వారు మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి, తాము ఏ పొరపాటు చేయలేదని, మంత్రులుగా తమ బాధ్యతలు నిర్వర్తించామని, తెరవెనుక జరిగే వాటికి తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు.
ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని వారు కోరారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి నుండి వారికి సంతృప్తికర సమాధానం రాలేదని చెబుతున్నారు. ధర్మాన రాజీనామాను తిరస్కరించే విషయంలోనూ ఆయన హామీ ఇవ్వలేదట. ఇక అధిష్టానం ఇప్పటికే పార్టీలోని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కకు తప్పిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతిని పాటిస్తోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ నేతలు మంత్రులకు అండగా నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో వారు గిలగిల కొట్టుకుంటున్నారని అంటున్నారు. మంత్రుల వ్యవహారం కిరణ్కు పెద్ద తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.
జగన్ వైపుకు విసిరిన అస్త్రం తమ పార్టీ నేతలకు కూడా తగులుతుండటంతో అధిష్టానం కూడా ఒకింత ఆందోళనగానే ఉందని, అయితే అవినీతిపై దేశవ్యాప్తంగా ఉద్యమం, విపక్షాల నుండి ఎదురుదాడి నేపథ్యంలో ఏమీ చేయలేకపోతుందని అంటున్నారు. జగన్ కేసు నుండి మంత్రులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుండగానే... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం వారిపై ఎదురు దాడికి దిగితోంది. కాంగ్రెసు ఉద్దేశ్య పూర్వకంగా జగన్ను లక్ష్యంగా చేసుకోవడం వల్లనే మంత్రులు ఇరుక్కున్నారని విమర్శిస్తున్నారు. మంత్రుల చుట్టూ ఉచ్చు బిగిస్తుండటంతో జగన్ వర్గంలో తాము సేఫ్ సైడ్ అనే ఆనందం కనిపిస్తోందని అంటున్నారు.