షర్మిల పాదయాత్ర: జగనన్న కోసం.. మమేకవుతూ..
హైదరాబాద్: పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొట్టుకుని పోకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల సుదీర్గమైన పాదయాత్ర జనంలో పడ్డారు. ఆమె నిత్యం పాదయాత్ర చేస్తూ అందరినీ పలకరిస్తున్నారు. వారితో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. సోదరుడు జగన్ జైలులో ఉండడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడం ఆమె భుజస్కంధాలపై పడింది.
తన పాదయాత్రలో షర్మిల బడుగు బలహీన వర్గాల ప్రజలను పలకరిస్తున్నారు. వైయస్ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందినవారిని ప్రస్తుతం ఆ పథకాల అమలు తీరుపై అడిగి తెలుసుకుంటున్నారు.
చిన్నపిల్లలను పలకరిస్తూ వారు బడికి పోతున్నారా, లేదా కనుక్కుంటున్నారు. వెళ్లకపోతే ఎందుకు వెళ్లడం లేదని ఆరా తీస్తున్నారు.
చల్లటి నీడను మరిచి ఎండలో నడుస్తూ ఇలా భుజం భుజం కలిపి సాధారణ జనాలతో కలిసి అడుగులు వేస్తున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.
ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూనే పలువురిని వ్యక్తిగతంగా కూడా కలుసుకుంటున్నారు. తాను వారికి అత్యంత సన్నిహితురాలిని అని ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
పంటలను పరిశీలిస్తూ రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. రాజన్న రైతు బాంధవుడని ప్రకటిస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తున్నారు.
మైనారిటీలను ఆకట్టుకోవడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు. వైయస్ పాలనలో మైనారిటీలకు జరిగిన మేళ్లు ఏమిటో వివరిస్తున్నారు.
జగనన్నను ముఖ్యమంత్రిగా చూడాలనే తాను పాదయాత్ర చేపట్టినట్లు చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందని హామీ ఇస్తున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందంటూ నిత్యం దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్ ద్వారా అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నీ సక్రమంగా అమలవుతాయని హామీ ఇస్తున్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి తన సోదరుడిని జైలు పాలు చేశాయని ఆమె ఆరోపిస్తున్నారు. తాజాగా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారంటూ చాటుతున్నారు. తమను గెలిపిస్తే అమలు చేసే కొత్త పథకాల గురించి ఆమె చెప్పడం లేదు. వైయస్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా జగనన్న అమలు చేస్తాడని చెబుతున్నారు.