సోనియా మతం, కోల్డ్ స్టోరేజీలో తెలంగాణ
తెలంగాణపై సత్వర నిర్ణయం తీసుకోవాలని తాము అనుకుంటున్నామని, అయితే ఏదో ఒక ఆటంకం వస్తోందని, ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని, ఇప్పుడు తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి వీలు కావడం లేదని ఆయన చెప్పారు. పండుగలు, సందర్భాలు, రాజకీయ పరిణామాలను కారణాలుగా చూపుతూ తెలంగాణ అంశాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తోంది. 2014 వరకు కూడా ఇదే దాటవేత ధోరణిని కాంగ్రెసు అధిష్టానం అనుసరించవచ్చుననే మాట వినిపిస్తోంది. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోదని ఇటీవల కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పిన మాటలే నిజమని అనిపిస్తోంది.
కాగా, తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా కాంగ్రెసుపై, కేంద్రంపై నెట్టేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా అదే వైఖరిని అవలంబిస్తున్నారు. ఒక స్పష్టమైన దారిని చూపేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. తప్పించుకునే మార్గాన్నే అవి అనుసరిస్తున్నాయి. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు తమ వైఖరులను చెప్పకపోవడాన్ని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు వాయిదా వేసే వైఖరిని అవలంబిస్తున్నారు. ఏమైనా, తెలంగాణ అంశాన్ని రగులుతున్న కుంపటిగానే ఉంచేట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. తెలంగాణకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో స్పష్టమైన వైఖరిని తీసుకోలేని పరిస్థితిని ఎదుర్కుంటూ, రాజకీయ ప్రయోజనాలనే ప్రధానంగా ఎంచుకున్నాయి. సంక్రాంతి తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎటువంటి ఆందోళనకు శ్రీకారం చుడుతారో తెలియడం లేదు.