జఫ్తు దిశగా జగన్ మీడియా: ఏం జరగొచ్చు!?

YS Jagan-Sakshi Building
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థల ఆస్తుల జఫ్తునకు రంగం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ ప్రారంభమైంది. జగన్ మీడియా ఆస్తుల జఫ్తుకు సంబంధించిన నోట్ ఫైళ్ల పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి బుధవారం రాత్రే సంతకాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

సిబిఐ గురువారం జగన్ మీడియా సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్ అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించింది. జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ ఫ్రా, ఇందిరా టెలివిజన్‌లకు చెందిన భవనాలు, ఇతర స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌ను సిబిఐ కోరింది. అలాగే సునీల్ రెడ్డికి చెందిన పులివెందులలో గల వ్యవసాయ భూములు, సికింద్రాబాదులోని స్థలం, కోనేరు రాజేంద్ర ప్రసాద్ పేరిట గల వ్యవసాయ భూముల అటాచ్‌మెంట్ సిబిఐ కోరింది.

అటాచ్‌మెంట్‌కు అంగీకారం తెలిపిన మెమో గురువారమే సిబిఐకి అందింది. ఇక జప్తునకు సంబంధించి ఏ క్షణంలోనైనా జివో జారీ అయ్యే అవకాశముందంటున్నారు. సర్కారు ఇచ్చిన మెమో ఆధారంగా సిబిఐ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. జాబితాలోని ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరతారు. రాజధానిలో, రాష్ట్రంలోనే కాదు ఆ కంపెనీల ఆస్తులు దేశంలో ఎక్కడున్నా.. వాటి అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతి జారీ చేయవచ్చు. నిందితుడి బినామీల పేరిట ఉన్న ఆస్తులనూ జప్తు చేసుకోవచ్చు.

సిబిఐ అటాచ్ విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు ప్రతివాదుల వాదన కూడా వింటుంది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తే అటాచ్‌మెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇలా ఉత్తర్వులు జారీ చేసే అధికారం జిల్లాస్థాయి కోర్టుకు ఉంటుంది. ఇక్కడ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఉంది కాట్టి ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. ఆ మరుక్షణం నుండి ఈ ఆస్తులను లీజుకు ఇవ్వడం, అమ్మడం, కొనడం నిషిద్ధం.

అటాచ్ ఐన తర్వాత ఆ కంపెనీ కార్యాలయాలు, ఆస్తుల ఆవరణలోని అన్ని వస్తువులు, ముడి సరుకు మొత్తం సిబిఐ పరిధిలోకి వస్తుంది. జగన్ మీడియా విషయానికి వస్తే, ఒకవేళ కోర్టు అనుమతిస్తే.. న్యూస్ ప్రింట్, ఫర్నీచర్, ముద్రణకు సంబంధించిన ఇంకూ వంటివన్నీ జప్తు పరిధిలోకే వస్తాయి. అయితే ఆయా ఆస్తుల ద్వారా కార్యకలాపాలు మాత్రం యథావిథిగా నిర్వహించుకోవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఒకవేళ ఇబ్బందులు ఎదురైన పక్షంలో.. ముడి సరుకు లేకుండా పత్రిక నడపలేమని, తగిన వెసులుబాటు కల్పించాలని జగన్ మీడియా కోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు కోర్టు ఒక రిసీవర్‌ను కానీ, ఎంపిక చేసిన కొందరు వ్యక్తుల బృందాన్ని కానీ ప్రత్యేకంగా నియమించే అవకాశముంటుంది. వారి కనుసన్నుల్లోనే మొత్తం కార్యకలాపాలు నడపాల్సిందిగా ఆదేశించే ఆస్కారమూ ఉందంటున్నారు.

ఈ ఆదేశాలు సంవత్సరం పాటు అమలులో ఉంటాయి. ఈ లోపు దర్యాఫ్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసే పక్షంలో ఇవే ఆదేశాలు తుది తీర్పు వచ్చే వరకూ కొనసాగుతాయి. ఒకవేళ సంవత్సరంలోపు ఛార్జీషీటు దాఖలు చేయని పక్షంలో సంవత్సరం తర్వాత మళ్లీ అటాచ్ ప్రక్రియ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది.

ఆస్తుల అటాచ్ ప్రక్రియ కేసు నమోదయిన తర్వాత ఎప్పుడైనా కోరవచ్చు. ఆలస్యమయ్యే పక్షంలో కేసుతో సంబంధం ఉన్న ఆస్తులను నిందితులు అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరలోనే అక్రమ మార్గంలో కూడబెట్టుకున్న ఆస్తులను గుర్తించి, వాటిని అటాచ్ చేసేందుకు దర్యాఫ్తు సంస్థ ఉద్యుక్తమవుతుంది. దర్యాఫ్తు పూర్తయ్యే వరకూ వెల్లడవుతున్న అక్రమ ఆస్తులను ఇలాగనే న్యాయస్థానం ద్వారా అటాచ్ చేస్తూనే ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+