గెలుపు అంత సులువేం కాదు! భార్య అండ(పిక్చర్స్)
బెంగళూరు: పార్టీని నడిపిస్తున్న నేతలు పరీక్ష ఎదుర్కొంటున్నారు. పార్టీని గట్టెక్కించడంతో పాటు తాము కూడా పరీక్షను ఎదుర్కొంటున్నారు. వచ్చే నెలలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా పార్టీల ముఖ్య నేతలు పార్టీని గట్టెక్కించడంతో పాటు తాము విజయం సాధించేందుకు, ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకున్నారు.
ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే ఉండటంతో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగదీష్ శెట్టార్, ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప, కర్నాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్, సిఎల్పీ నేత సిద్ధరామయ్య, జెడి(ఎస్) ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన సతీమణి అనిత, కర్నాటక జనతా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆ పార్టీ నేత, మాజీ మంత్రి శోభా కరంద్లాజే ఉన్నారు.
బిఎస్సార్ పార్టీ నేత శ్రీరాములు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తదితరులు పరీక్షించుకోనున్నారు. మే 5న ఎన్నికలు జరుగుతాయి. 8న ఫలితాలు వస్తాయి. కర్నాటక ఎన్నికల ప్రచారానికి కాంగ్రెసు, బిజెపి జాతీయ నేతలు వస్తున్నారు. ఈసారి మళ్లీ అధికార బిజెపికి ఆశలు లేకపోగా కాంగ్రెసు పట్టు పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
జగదీష్ శెట్టార్ బిజెపి సీనియర్ నేత. సంక్షోభ సమయంలో సిఎం అయ్యారు. ఓ వైపు ఎమ్మెల్యేలు యడ్డీ వైపు చూస్తున్నారు. మరోవైపు స్థానికంలో ఎదురు దెబ్బ తగిలింది. శెట్టార్ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలా ప్రజల్లో చరిష్మా గల నేత కాదు. బిజెపికి పట్టున్న ముంబై కర్నాటక ప్రాంతానికి చెందిన బలైన లింగాయత్ నేత. హుబ్లీ ధార్వాడ్ నియోకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన గెలుపు సునాయాసమే!
బిజెపి అధిష్టానం తనను తిరిగి ముఖ్యమంత్రిగా చేయక పోవడంతో అలకవహించిన యడ్యూరప్ప ఓ నేత స్థాపించిన కెజెపిలో చేరి అధ్యక్షుడయ్యారు. యడ్డీకి బలమైనలింగాయత్ సామాజికవర్గం నేత. ఇతను శిఖారిపుర స్థానం నుండి బరిలో దిగుతున్నారు. ఈయన నియోజకవర్గంలో మూడొంతుల ఓట్లు లింగాయత్లవే. 1996 నుండి ఒక్క 1999 మినహా ప్రతిసారి ఈ నియోజకవర్గం నుండి యడ్డీ గెలిచారు. ఇప్పుడు బిజెపిని వీడటంతో అటు బిజెపితో పాటు యడ్డీకి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటి వరకు సునాయాసంగా గెలుస్తూ వచ్చిన యడ్డీ గెలుపు ఈసారి కష్టంగానే ఉంది. బిజెపి అభ్యర్థి యడ్డీ ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టగా మిగిలిన వర్గాలు కాంగ్రెసుకు అండగా ఉన్నాయి.
యడ్డీ వర్గానికి చెందిన శోభా కరంద్లాజే ఆయనకు మద్దతుగా బిజెపి నుండి బయటకు వచ్చారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చారు. బెంగళూరు నగరంలోని రాజాజీనగర స్థానం నుండి ఆమె పోటీలో ఉన్నారు. న్యాయశాఖ మంత్రి సురేష్ కుమార్ను ఓడించాలనే ఉద్దేశ్యంతో శోభాను యడ్డీ బరిలోకి దించుతున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టయ్యాక ఆయన అనుచరుడు శ్రీరాములు బిజెపిని వీడి కొత్త పార్టీ పెట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బళ్లారి తదితర ప్రాంతంలో ఆయన ఎఫెక్ట్ బిజెపిపై పడనుంది. శ్రీరాములు బళ్లారి గ్రామీణం.
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్యకు మైసూర్ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ఉంటారు. ఇతను మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గం నుండి బరిలో ఉన్నారు. ఇక్కడ ఈయనకు పెద్దగా ఆదరణ లేదు. ఆయనకు ఎదురీత తప్పదు.
ఉప ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత ఈశ్వలరప్ప షిమోగా నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కెజిబి, కాంగ్రెసులు బలంగా ఉన్నాయి. ఈశ్వరప్ప గెలుపు సులువు కాదు.
జెడి(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామికి ఓ సామాజికవర్గం అండ ఉంది. పాత మైసూరులో ఈయనకు మంచి పట్టు ఉంది. బిసిలు, మైనార్టీల మద్దతు ఉంది. ఇది జెడి(యు)కి కలిసి వస్తుంది. మరోవైపు ఇతను బెంగళూరు రామనగర ప్రాంతం నుండి బరిలో నిలుస్తున్నారు. కుమారస్వామికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఎదురీత తప్పేలా లేదు.
కుమారస్వామి సతీమణి అనిత చెన్నపట్నం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎస్పీ అభ్యర్థి నుండి ఆమె పోటీ ఎదుర్కొంటున్నారు. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీయే వస్తుందంటున్నారు.
ప్రముఖ సినీ నటుడు అంబరీష్ మాండ్య స్థానం నుండి పోటీ చేస్తున్నారు. ఇతని తరఫున సినీ నటి సుమలత కూడా ప్రచారం చేస్తున్నారు. కన్నడ సినిమాల్లో వెలుగు వెలిగిన అంబరీష్ కేంద్రంలో మంత్రిగా పని చేశారు. అయితే, శాసనసభకు మాత్రం ఒక్కసారి ఎన్నిక కాలేదు.