బస్సు యాత్ర: సమైక్య చిక్కుల్లో చంద్రబాబు
హైదరాబాద్: కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పరిణామాలను వివరించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో తలపెట్టిన బస్సు యాత్రకు చిక్కులు వచ్చి పడే ప్రమాదం ఉంది. చంద్రబాబు బస్సు యాత్రపై తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రజలు ఆయన యాత్రను ఎలా స్వీకరిస్తారనే ఆందోళతో వారున్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే కేంద్రం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులతో పాటు లగడపాటి రాజగోపాల్ వంటి కాంగ్రెసు నాయకులు కూడా విమర్శిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాదాపుగా సమైక్యవాదాన్ని భుజాన వేసుకుంది. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల నుంచి చంద్రబాబుకు వ్యతిరేకత ఎదురు కావచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు బస్సు యాత్ర చేయడానికి ఇది తగిన సమయం కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ కూడా అన్నారంటే ఆ ఆందోళన ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు.
పైగా, ఎపి ఎన్జీవోలు కూడా చంద్రబాబు తీరును తప్పు పడుతున్నారు. సమైక్యవాదానికి అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి చంద్రబాబు యాత్ర చేయాలని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. స్పష్టత ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబుకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు.
చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కత్తులు నూరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ వాదాన్ని చంద్రబాబు సీామంధ్రలో వినిపిస్తారా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు విమర్శించారు. అయితే, రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు కుట్ర చేసిందని, దానికి వైయస్సార్ కాంగ్రెసు, తెరాస దోహదం చేస్తున్నాయని చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఈ మూడు పార్టీల నాటకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి తాను బస్సు యాత్ర చేస్తానని ఆయన చెప్పారు. ఏమైనా, రేపు ఆదివారం ఆయన బస్సు యాత్రను చేపట్టబోతున్నారు.