సదస్సురద్దు: తెలంగాణ తేల్చేస్తున్నారు, ముందస్తు!
ఈ నెల 7వ తేది నుండి విజయవాడలో ప్రాంతీయ సదస్సు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెసు నిర్ణయించింది. అందుకోసం అంతా సిద్ధమైంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం అక్కడకు వెళ్లి పనులను పర్యవేక్షించారు. ఇలాంటి సమయంలో పార్టీ అధిష్టానం నుండి గురువారం రాత్రి హఠాత్తుగా బొత్సకు ఫోన్ వచ్చింది. ప్రాంతీయ సదస్సు వాయిదా వేసుకోవాలని సూచించారు. అధిష్టానం ఆదేశంపై రాష్ట్ర కాంగ్రెసులో విస్మయం వ్యక్తమవుతోంది.
కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ స్వయంగా బొత్సకు ఫోన్ చేసి సదస్సును వాయిదా వేయాలని సూచించారు. ఇంత హఠాత్తుగా అధిష్టానం ఫోన్ చేసి వాయిదా వేయాలనే నిర్ణయం పట్ల వివిద రకాల వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్లో హైదరాబాదులో ఏర్పాటు చేసిన రాష్ట్ర కాంగ్రెసు సదస్సు విజయవంతమైంది. ఈ ఆనందంలో రాష్ట్ర కాంగ్రెసు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని భావించింది.
ప్రాంతీయ సదస్సులు నిర్వహించి తెలంగాణ, సమైక్యవాద ఉద్రేకాలు పెంపొందించడం సరికాదనే ఉద్దేశ్యంతోనే అధిష్టానం ఆదేశించిందని అంటున్నారు. ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తే ఖచ్చితంగా ఆయా ప్రాంతాల నేతలు విభజనపై తమ తమ వాదనలను బలంగా వినిపిస్తారు. అవి పార్టీని ఏ వైపుకు తీసుకు వెళ్తాయో ఆనే ఆందోళన అధిష్టానాన్ని పట్టుకొని ఉంటుందని అంటున్నారు.
అంతకుముంచి తెలంగాణపై తేల్చేందుకే అధిష్టానం ప్రాంతీయ సదస్సుల వాయిదా వేయాలని కోరిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ సమస్య పరిష్కారం కోసమే వాయిదా కావొచ్చునని ఢిల్లీలో చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సమస్యను ఇలాగే నాన్చితే ఇరు ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీకి నష్టం తప్పదని పరిష్కరించడం ద్వారానైనా ఇప్పటికిప్పుడు ఓ ప్రాంతంలో లబ్ధి పొందడమే కాకుండా ఎన్నికలకు సమయం ఉన్న కారణంగా అప్పటి వరకు రెండో ప్రాంతంలో పార్టీని కొద్దిగానైనా బలోపేతం చేసుకోవచ్చుననే ఉద్దేశ్యంతో ఉందని అంటున్నారు.
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లుగా నెల రోజుల్లో తెలంగాణకు ఓ పరిష్కారం చూపించే దిశగా కాంగ్రెసు పార్టీ యోచిస్తోందని అంటున్నారు. గురువారం రాత్రి కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో దేశంలోని వివిద సమస్యలతో పాటు తెలంగాణ సమస్యను ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని అవసరమైన పక్షంలో ముందస్తు ఎన్నికలకు కూడా కాంగ్రెసు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
తెలంగాణ ఇవ్వడం కాకుండా మధ్యేమార్గంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్లాన్ను ఫాలో కావాలని కాంగ్రెసు పార్టీ యోచిస్తున్నట్లుగా సమాచారం. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం ద్వారా ప్రస్తుతానికి తెలంగాణలో కొద్దిగా వేడిని చల్లార్చాలని చూస్తున్నారని సమాచారం. తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్రలో, ప్రకటించకుంటే తెలంగాణలో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతాయి. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే సీమాంధ్ర నుండి పెద్దగా ప్రభావం ఉండదు. అయితే తెలంగాణలో మొదట నిరసనలు వ్యక్తమయినప్పటికీ ఆ తర్వాత కూల్ అవుతుందనే భావనలో కాంగ్రెసు పార్టీ నేతలు ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.