తెలంగాణ: రాహుల్ కింగ్.. జగన్ కింగ్మేకర్!
42 పార్లమెంటు స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసుకు ఎంతో ముఖ్యమైన రాష్ట్రం. కానీ, ఇప్పుడు తెలంగాణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంశాలు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. తెలంగాణ ఇవ్వకుంటే అక్కడ కాంగ్రెసు కనుమరుగు అవుతుంది. ఇస్తే సీమాంధ్ర నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలు తెలంగాణ ఇస్తేనే ఓ విధంగా మంచిదనే అభిప్రాయంతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఇవ్వని పక్షంలో తెలంగాణ ప్రాంతంలో సెంటిమెంట్ కారణంగా పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని, అదే సమయంలో సీమాంధ్రలో జగన్ ప్రభావం కారణంగా చిత్తయ్యే పరిస్థితి ఉందని అధిష్టానం భావిస్తోందట. తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతంలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవచ్చుననే ఆలోచనతో ఉందట. అందుకే ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆ తర్వాతే....!
తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడం ద్వారా ఆ ప్రాంతంలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచే ఆలోచన చేస్తున్న కాంగ్రెసు ఎన్నికల అనంతరం సీమాంధ్రలో జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకొని ఈ రెండు ప్రాంతాల నుండి రాహుల్ గాంధీకి ఎక్కువ మద్దతు కూడగట్టుకోవడం ద్వారా ఆయనను ప్రధానిగా చూడాలని భావిస్తోందట! ఎన్నికలు నిర్దిష్ట సమయంలో వచ్చినా లేక ముందస్తు ఎన్నికలు వచ్చినా సీమాంధ్రలో జగన్ హవానే కొనసాగుతుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. అందుకే ఎన్నికల తర్వాత జగన్ పార్టీ చేయి కలపాలని భావిస్తోందని అంటున్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో బలం పెంచుకొని, ఎన్నికల తర్వాత జగన్ పార్టీతో వెళ్లడం ద్వారా ఎక్కువ సీట్లను యూపిఏకు కూడగట్టుకోవచ్చుననే భావన కాంగ్రెసు పార్టీ అధిష్టానంలో ఉందని అంటున్నారు.