తెలంగాణ, రాయల తెలంగాణ, : అధికారం ఎవరిది?
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలకు వేర్వేరు పిసిసిలను కాంగ్రెసు అధిష్టానం నియమిస్తుంది. అదే సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కొలువు తీరుతారు. శాసనసభలో తీర్మానం, కేంద్ర మంత్రుల బృందం ఏర్పాటు, కేంద్ర కేబినెట్ తొలి నోట్, దానికి మంత్రివర్గం ఆమోదం, రాష్ట్రపతి సిఫారసుతో అసెంబ్లీకి బిల్లు, అసెంబ్లీలో బిల్లు పరిశీలన, కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు బిల్లు ముసాయిదా, కేబినెట్ తుది నోట్, బిల్లుకు సాధారణ మెజారిటీతో పార్లమెంటు ఆమోదం, చివరగా రాష్ట్రపతి ఆమోద ముద్ర అనే 12 దశల్లో కొత్త రాష్ట్రం ఏర్పడాల్సి ఉంటుంది.
ఈ దశల్లో అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 11 దశలు పూరి చేయడానికి 215 రోజులు అవసరమని తొలుత భావించింది. ఆ తర్వాత ఈ గడువును 144 రోజులకు కుదించింది. ఇప్పుడు దాన్ని 90 రోజులకు కుదించినట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్లో రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం 2009 మే 20వ తేదీన ఏర్పడింది. దీని ప్రకారం 2014 మే 19వ తేదీతో దీనికి ఐదేళ్లు నిండుతాయి. దాని ప్రకారం మరో తొమ్మిది పది నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. రాష్ట్రాన్ని ఎన్నికలకు ముందు విభజిస్తే ప్రస్తుత సభ్యుల సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు ఉంటే, అక్కడ ఆ ప్రభుత్వాలే ఏర్పడతాయి. ఆ తర్వాత 2014లో రెండు రాష్ట్రాలకు విడివిడిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2000లో ఏర్పడిన జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ల విషయంలో ఈ రకంగానే జరిగింది.
ఆ ప్రకారం అంచనాలు వేసుకుంటే, రాయల తెలంగాణలోగానీ, పది జిల్లాలతో కూడిన తెలంగాణలోగానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు. ఖాళీలుపోగా రాయల తెలంగాణ అసెంబ్లీ మ్యాజిక్ నెంబర్ 74 అయితే, కాంగ్రెస్కు 63 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. పది జిల్లాల తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 60 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్కు 49 మంది మాత్రమే ఉన్నారు. 'రాయల తెలంగాణ'కు ఎంఐఎం మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, రాయల తెలంగాణను బిజెపి వ్యతిరేకిస్తోంది. బీజేపీ మద్దతులేకుండా పార్లమెంటులో తెలంగాణ బిల్లు నెగ్గదు. దీన్నిబట్టి చూస్తే, రాయల తెలంగాణ ఏర్పాటు వెంటనే అనేది సాధ్యం కాకపోవచ్చు.
పైగా, రాయల తెలంగాణకు కాంగ్రెసుకు చెందిన ఆ ప్రాంత నాయకులు కూడా అంగీకరించడం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరించే అవకాశం లేదు. అయితే, ఈ లెక్కలతో అవసరం లేకుండానే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, విభజన తర్వాత 'అత్యధిక స్థానాలు' ఉన్న పార్టీగా కొత్త రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఏర్పడతాయని మరికొందరు చెబుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతాల్లో మెజారిటీ ఉన్న పార్టీలే ప్రభుత్వాలను స్థాపించాయి.
మొత్తంగా, ఆంధ్ర రాష్ట్రం లేదా రాయలాంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.