పురంధేశ్వరిపై దూకుడు పెంచిన టిఎస్సార్(పిక్చర్స్)
విశాఖపట్నం జిల్లా కాంగ్రెసు పార్టీలో వర్గ విబేధాలు రోజు రోజుకు మరింత రాజుకుంటున్నాయి. కేంద్రమంత్రి పురంధేశ్వరి విశాఖ సీటుపై కన్నేసిన టి.సుబ్బిరామి రెడ్డి ఆ దిశలో తన ప్రయత్నాల జోరును పెంచారు. పురంధేశ్వరి కంటే ముందు అక్కడ నుండి టిఎస్సార్ పోటీ చేశారు. ఆమె రాకతో అధిష్టానం బుజ్జగించడంతో అతను సీటును వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు విశాఖ సీటు రగడ పురంధేశ్వరి, టిఎస్సార్ల మధ్య పెద్ద చిచ్చు రేపుతోంది.
సాధారణ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో టిఎస్సార్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. విశాఖ టిక్కెట్ ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇన్నాళ్లు పురంధేశ్వరి నరసారావుపేట లేదా బాపట్ల నుండి పోటీ చేస్తుందని మాటల వరకే పరిమితం అయిన టిఎస్సార్ ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారట. ఇందులో భాగంగానే ఇటీవల విశాఖ తీరంలో మహాశివరాత్రి వేడుకలను నిర్వహించారట.
పురంధేశ్వరితో విశాఖ వివాదానికి తొలుత టి.సుబ్బిరామి రెడ్డి తెర దీశారంటున్నారు. అందుకు శివరాత్రి రోజు తన ప్రత్యక్ష కార్యాచరణను ప్రారంభించారని అంటున్నారు.
శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రహ్మానందం, మోహన్ బాబు వంటి వారితో తన వ్యూహంలో భాగంగానే టిఎస్సార్ను వదులుకోవద్దని మాట్లాడించారని అంటున్నారు.
విశాఖను వదులుకునేందుకు సిద్ధంగా లేని పురంధేశ్వరి. అందుకోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే టియస్సార్ వైఖరితో తల పట్టుకుంటున్న పురంధేశ్వరిపై ఇటీవల గంటా వర్గం మండిపడుతోంది. వీరి వెనుక చిరంజీవి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
పురంధేశ్వరి, టి సుబ్బిరామి రెడ్డి.. ఇలా గ్రూపు రాజకీయాలు విశాఖ కాంగ్రెసును చిక్కుల్లో పడేస్తోంది. విశాఖ వర్గ విబేధాల పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులను, రాజకీయ నాయకులను ఆహ్వానించి టిఎస్సార్ వంటి నాయకుడిని వదులుకోవద్దని చెప్పించారు. ఇదంతా ఆయన పాచికలో భాగమేనని అంటున్నారు. విశాఖలో ఇప్పటికే తనకున్న మద్దతుకు తోడు మరింత కూడగట్టుకొని పురంధేశ్వరిని అక్కడి నుండి పంపించి వేయాలనే ఆయన తెర వెనుక బాగానే ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు పురంధేశ్వరి కూడా విశాఖ సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేరు. అయినా, అధిష్టానం నిర్ణయిస్తుందని ఆమె చెబుతూ వస్తున్నారు. అధిష్టానం అని చెబుతున్నా విశాఖ కోసమే ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు.
వివాదానికి తెర లేపింది టిఎయస్సారేనా?
విశాఖ సీటుకు మొదట తెర లేపింది టియస్సారే అని చెప్పవచ్చు. నెల్లూరు నుండి పోటీ చేయక ముందు, పోటీ చేసి ఓడిన తర్వాత ఆయన విశాఖ నుండి పోటీ చేస్తానని పలుమార్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించేందుకు పురంధేశ్వరి పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే, ఇప్పుడు ఆయన మాటలు కాకుండా చేతలు చూపిస్తున్నారట. శివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగిన కార్యక్రమం అందులో భాగమేనంటున్నారు. విశాఖ సీటుపై మొదట తెర లేపింది టిఎయస్సారే అంటున్నారు.
విశాఖలో కేవలం టియస్సార్, పురంధేశ్వరిల మధ్యనే కాదు. చాలా వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇటీవల గంటా శ్రీనివాస రావు వర్గం పురంధేశ్వరి పైన మండిపడింది. వీరి వెనుక కేంద్రమంత్రి చిరంజీవి ఉన్నారనే వాదనలు వినిపించాయి. జిల్లాలో మంత్రి బాలరాజు వర్గం హవా కూడా నడుస్తోంది. పురంధేశ్వరి, టిఎస్సార్, గంటా, బాలరాజులు ఇలా అధికార పార్టీలో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారట.