రాహుల్గాంధీ చేతిలో తెలంగాణ!, జగన్ లైట్
అయితే, తాజాగా ఈ తెలంగాణ అంశం రాహుల్ గాంధీ కోర్టులోకి వెళ్లిందనే చెప్పవచ్చు. శుక్ర, శనివారాల్లో రాష్ట్రాల సిఎంలు, పిసిసి చీఫ్ల సమావేశం సందర్భంగా రాహుల్ ఎపి నుండి వచ్చిన కిరణ్, బొత్సలను తెలంగాణ, జగన్ బాబు అంశాలపై ప్రశ్నించారు. జగన్ సమస్య అంత పెద్దదేమీ కాదని కానీ, తెలంగాణ అంశమే పెద్ద చిక్కుముడి అని వారు రాహుల్కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్లాన్గా వెళితే సీమాంధ్రలో జగన్ను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదనీ చెప్పినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణపై ఆలోచించి సమస్యను త్వరగా తేల్చితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిలో మార్పు వస్తుందని వారు సూచించారట. తెలంగాణ సమస్యను ఎంత త్వరగా వీలైత అంత త్వరగా తేల్చాలని వారు సూచించారు. ఇదే విషయాన్ని బొత్స, కిరణ్లు కూడా మీడియా సమావేశంలో చెప్పారు. తెలంగాణను తేల్చాలని తాము రాహుల్కు సూచించినట్లు చెప్పారు. కాగా వారు తెలంగాణ సమస్య గురించి చెబుతుండగా.. ప్రత్యేక రాష్ట్ర వాదం తమ రాష్ట్రంలోనూ ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు.
తెలంగాణ ఇస్తే ఆ ప్రభావం విదర్భపైనా పడుతుందని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. విదర్భ అంశంపైనా తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ సిఎల్పీ నేత, ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ప్రత్యేక వాదం సమస్య తమకు కూడా ఉందని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని గానీ, తీసుకోవద్దని గానీ ఇరురాష్ట్రాల నాయకులూ చెప్పలేదు.
కానీ, తమ తమ రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉందని, తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే తమ రాష్ట్రాల్లోని ప్రత్యేక సమస్యలనూ పరిష్కరించాలని రాహుల్కు వివరించారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో కలిపి చూడకూడదని ఆ ప్రాంత నేతలు చెబుతున్నా.. ఆందోళన మాత్రం కనిపిస్తోంది. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వేరని, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రస్తావించామని తెలంగాణ ప్రాంత నేతలు గుర్తు చేస్తున్నారు. పలు జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు మద్దతు తెలుపుతున్నాయి.
మరోవైపు సీమాంధ్ర నేతలు సమైక్యాన్నే కోరుకుంటున్నారు. తెలంగాణ, సీమాంధ్ర నేతల వాదనను బొత్స, కిరణ్లు రాహుల్ ముందుంచారు. అయితే, ఈ అంశంతో కాంగ్రెసు పార్టీ నష్టపోకుండా, జాతీయస్థాయిలో ప్రభావం పడకుండా రాహుల్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ అంశం ఆజాద్, సోనియాలను దాటుకొని ఇప్పుటు రాహుల్ కోర్టులోకి వెళ్లింది. సోనియా తెలంగాణకు అనుకూలంగా ఉండగా రాహుల్ అనుకూలంగా లేరనే వ్యాఖ్యలు గతంలో వినిపించాయి. ఏఐసిసి ఉపాధ్యక్ష పదవిని చేపట్టాక పలు కీలకాంశాలపై దృష్టి సారించిన రాహుల్ తెలంగాణ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతారోనన్న ఆసక్తి అందరిలో ఇప్పుడు నెలకొంది.