ముగ్గురు ఔట్: కెసిఆర్పై బాబు రివర్స్ గేమ్
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసేస్తామని అధినేత కెసిఆర్ ప్రకటించగా.. దానికి భిన్నంగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు కారు దిగి సైకిల్పై షికారుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది. టిడిపి సీనియర్ నేత కడియం శ్రీహరి సహా ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులకు తెరాస నేతలు గేలం వేస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఇప్పటిదాకా ఉత్సాహంగా ఉన్న గులాబీ నేతలు.. టిడిపి 'గేమ్' మొదలవగానే ఒకింత కలవరానికి గురవు తున్నట్టు కనిపిస్తున్నాయి.
అసంతృప్త నేతలు, అధినేత కెసిఆర్ వైఖరితో విసుగెత్తిన నేతలను దేశం బాట పట్టించడంలో టిడిపి కొంత వరకు సఫలీకృతం అయినట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , మాజీ ఎంపి చాడ సురేష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దొమ్మాటి సాంబయ్య, మేకల సారంగపాణి మూడు రోజుల క్రితం చంద్రబాబుని కలిసినట్లు సమాచారం. అనుచరులతో కలిసి టిడిపి తీర్థం పుచ్చుకుంటామని వారు కోరాగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పార్టీకి, పదవికి దొమ్మాటి సాంబయ్య బుధవారం రాజీనామా చేశారు. ఆ తరువాత కొన్ని గంటలకే చాడ సురేష్ రెడ్డి, మేకల సారంగపాణిలపై తెరాస సస్పెన్షన్ వేటు వేసింది. వారిద్దరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పైకి చెప్పినా, చంద్రబాబుతో భేటీ అంశమే అధినాయకత్వానికి కోపం తెప్పించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫాంహౌస్లో ఉన్న కెసిఆర్, తనను కలవాల్సిందిగా మేకల సారంగపాణికి బుధవారం కబురు పంపారట.
తీరా ఆయన స్పందించేలోపే సస్పెన్షన్ వేటు వేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందట. ఉద్వాసనకు గురైన వారిలో సారంగపాణి హైదరాబాద్కు చెందిన నేత కాగా, సురేశ్ రెడ్డి గానీ, రాజీనామా చేసిన సాంబయ్య గానీ.. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్కు చెందిన బలమైన నాయకులు. దీంతో తాజా పరిణామం ఆ జిల్లా రాజకీయాలపై కాక, పార్టీపైనా ప్రభావం చూపుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.