జగన్ వ్యూహం: తెలంగాణపై బాబు బోల్తా (ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహం ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బోల్తా కొట్టారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై ఆయన ఇటీవల ప్రకటించిన వైఖరి ఇటు తెలంగాణవాదులను సంతృప్తిపరచకపోగా, అటు సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తెలంగాణ అనుకూలంగా కేంద్రం నుంచి సంకేతాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం సీమాంధ్ర నేతలు చంద్రబాబు వైఖరిని ప్రశ్నించే విధంగా మాట్లాడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు ఒక్కసారిగా తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూ మాటల తూటాలు వదులుతున్నారు. వైయస్ జగన్ తెలంగాణపై ఎటూ తేల్చకపోవడం ద్వారా సీమాంధ్ర నాయకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు తెలంగాణ అనుకూల వైఖరి ప్రకటించారని సీమాంధ్రలో అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ స్థితిలో చంద్రబాబు సీమాంధ్ర పర్యటనలో తనకు ఎదురయ్యే ప్రశ్నలకు ఏ విధమైన సమాధానాలు చెబుతారనేది ఆసక్తిగా మారింది.
తెలంగాణపై నిర్ణయం ప్రకటించిన వెంటనే ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి నమస్కారం పెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు మరోసారి పెద్ద యెత్తున తెలుగుదేశం పార్టీకి సీమాంధ్రలో దెబ్బ తలగనుందా అనే సందేహం తలెత్తుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడానికి పలువురు నాయకులు చంద్రబాబు తెలంగాణ వైఖరిని తప్పు పడుతున్నారని అంటున్నారు. తెలంగాణ అనుకూల వైఖరి చంద్రబాబుకు సీమాంధ్రలో కష్టాలు తెచ్చి పెడుతుందని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ వైఖరి సీమాంధ్రలో సమస్యలు సృష్టిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వ్యూహానికి చంద్రబాబు బోల్తా పడ్డారనే మాట వినిపిస్తోంది. సీమాంధ్రలో ఎదురయ్యే ప్రశ్నలకు చంద్రబాబు ఏ విధమైన సమాధానం చెప్తారనే ఆసక్తి నెలకొని ఉంది. సీమాంధ్రలో మళ్లీ సమైక్యవాదం వినిపిస్తే చంద్రబాబు విశ్వసనీయత మరింతగా దెబ్బ తినే ప్రమాదం ఉంది.

చంద్రబాబు తెలంగాణ అనుకూల వైఖరిని వైయస్ జగన్ సీమాంధ్రలో తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు. ఒక వేళ రాష్ట్ర విభజన జరిగితే నిందను చంద్రబాబుపై మోపడానికి ఆయన రెడీగా ఉన్నారు. చంద్రబాబు తెలంగాణ అనుకూల వైఖరి వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీపై దాడిని ఎక్కుపెట్టనుంది. ఇది సీమాంధ్రలో చంద్రబాబుకు తీవ్రమైన కష్టాలను తెచ్చి పెట్టే ప్రమాదం ఉంది.

చంద్రబాబు తెలంగాణ వైఖరికి రాయలసీమకు చెందిన శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ ఎదురు తిరిగారు. తమ పార్టీ వైఖరి తెలంగాణకు అనుకూలం కాదని ఆయన చెప్పారు. దీంతో తెలంగాణవాదుల నుంచి చంద్రబాబు మీద ప్రశ్నల వర్షం కురుస్తోంది. పయ్యావుల కేశవ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని గతంలో ప్రచారం జరిగింది. అయితే, తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మీడియా సమావేశంలో ఏడ్చేశారు.

తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద రావు. ఆయన తెలంగాణ అనుకూల వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమ పార్టీ వైఖరి తెలంగాణకు అనుకూలం కాదని కూడా చెప్పాడు.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పూర్తిగా సమైక్యవాది. చంద్రబాబు తెలంగాణ వైఖరిపై ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.

నన్నపనేని రాజకుమారి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆమె కూతురు, అల్లుడు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. పిల్లలు తాను చెప్తే వినడం లేదని ఆమె ఇప్పటి వరకు తప్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ వైఖరిని సాకుగా చూపి ఆమె తన రాజకీయ విధేయతలను మార్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ నాయకుల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లకు, తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలనే తాపత్రయానికి తలొగ్గి చంద్రబాబు ఏదో మేరకు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించారని చెబుతున్నారు. ఏమైనా, ఇది చంద్రబాబుకు సవాల్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తెలంగాణ వైఖరిని నిరిసిస్తూ తెలుగుదేశం నాయకులు వైయస్సార్ కాంగ్రెసులోకి మరింతగా రావచ్చునని ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications