నేను చూసుకుంటా: ఆదాల ట్విస్ట్పై కిరణ్ ధీమా
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని పోటీ నుంచి వైదొలగించే బాధ్యతను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెత్తిన వేసుకున్నారట. ఆదాలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పిస్తానని శనివారం నాటి సీమాంధ్ర నేతల సమావేశంలో ఆయన చెప్పారట. ఆదాల ఒక్కరు వైదొలిగితే రాజ్యసభ ఎన్నిక నామమాత్రమే అవుతుంది. ఆ బాధ్యత తాను తీసుకుంటానని, ఇప్పుడు మనం ఢిల్లీ పైన దృష్టి పెట్టాలని సమావేశంలో సూచించారట.
రాజ్యసభ ఎన్నికల అంశాన్ని తనకు వదిలేయాలని, ఆ ఎన్నికల ప్రక్రియ తనకు కొట్టిన పిండి అని కిరణ్ చెబుతున్నారట. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆ ఎన్నికలపై పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రులు, ఇతర ముఖ్య నేతలతో సమావేశం అవుదామని చెప్పారు. రాజ్యసభ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు ఎలా రచించాలో తనకు బాగా తెలుసునని కిరణ్ స్పష్టం వారికి స్పష్టం చేశారట.

బొటా బొటీ మెజారిటీ ఉన్నప్పుడే ఒక అభ్యర్థిని అధికంగా గెలిపించుకున్న చరిత్ర ఉందని, ఇప్పుడు ఎక్కువ ఓట్లు ఉన్నందున నల్లేరుపై బండినడకేనని, కాంగ్రెస్ అభ్యర్థులు కెవిపి రామచంద్ర రావు, ఎంఏ ఖాన్, టి సుబ్బిరామి రెడ్డిలు విజయం సాధిస్తారన్న ధీమాను కిరణ్ వ్యక్తం చేస్తున్నారట. రాజ్యసభ బరిలోంచి తప్పుకోవాలని చైతన్య రాజును కోరానని, తన మాటను ఆయన మన్నించారని అలాగే, శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం ఆదాలని కూడా సంప్రదించానని, తప్పుకోవాలని సూచించానని, నామినేషన్ను ఉపసంహరించుకుంటానని ఆదాల హామీ ఇచ్చారని కిరణ్ వారికి వివరించారు.
సమయం 3 గంటలు కావస్తున్నా తప్పుకోకపోవడంతో మరోసారి ఆయనతో మాట్లాడానని, పోటీ నుంచి తప్పుకోవాలని గట్టిగానే చెప్పానని, తాను దూరంగా ఉన్నానని చెప్పడంతో అసెంబ్లీకి తొందరగా వెళ్లి నామినేషన్ ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశానని తెలిపారు. మొదట సరేనని చెప్పిన ఆదాల ఆ తర్వాత మాట తప్పారని తెలిపారట.
ఈ సమయంలో మంత్రి ఆనం రామనారాయణ మాట్లాడుతూ... ఆదాలకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య డీల్ కుదిరిందని చెబుతున్నారని, ఆదాల బంధువు మేకపాటి చంద్ర శేఖర రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోందని చెప్పారు. జగన్తో మాట్లాడి ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారంటున్నారని తెలిపారు. నిన్నటి వరకూ ఆదాల టిడిపిలోకి వెళ్తారని అన్నారని ఇప్పుడు ఆయన జగన్ పార్టీతో వెళ్లేందుకు సిద్ధమయ్యారని, అసలు ఆదాల ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదని ఆనం అన్నారు.
ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లోనే ఉన్నందున సిఎం ఒకసారి పిలిచి మాట్లాడితే బాగుంటుందని రఘువీరా సూచించారు. ఇందుకు కిరణ్ సరేనన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో అధికారిక అభ్యర్థులు మినహా మిగిలిన వారెవరూ గెలిచే ప్రశ్నే లేదని కిరణ్ స్పష్టం చేశారు. ఆదాల చెబితేనే ఎమ్మెల్యే వెంకట్రామయ్య రిటర్నింగ్ అధికారి వద్ద వేచి ఉన్నారని, కానీ, టీవీల్లో స్క్రోలింగ్లు వచ్చిన వెంటనే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుని ఫోర్జరీ, క్రిమినల్ కేసులు పెడతానంటూ ఆదాల బెదిరించడం ఏమిటని మంత్రులు గంటా, శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు కోసం మజ్లిస్ పార్టీతో చర్చించాలని కాంగ్రెసు నేతలు నిర్ణయించారు. మరోవైపు ఏ ఎమ్మెల్యేను ఏ అభ్యర్థికి కేటాయించాలో తాను చూసుకుంటానని కిరణ్ చెప్పారు.












Click it and Unblock the Notifications