కిరణ్, సబిత..: తప్పుకున్న ముఖ్యనేతలు, వీరే!
ఈ సార్వత్రిక ఎన్నికలలో పలువురు ప్రముఖ నేతలు వివిధ కారణాలతో పోటీకి దూరంగా ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు తదితర ప్రముఖులు పోటీకి దూరంగా ఉన్నారు.
కొందరు స్వచ్చంధంగా తప్పుకోగా.. మరికొందరు తప్పనిసరై తప్పుకున్నారు. ఎన్నికల బరి నుండి తప్పుకున్న వారిలో చాలామంది కాంగ్రెసు నేతలు లేదా కాంగ్రెసు నుండి బయటకు వచ్చిన వారే ఉండటం గమనార్హం.
దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి.. స్థానికంగా, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొంది, చక్రం తిప్పిన సీనియర్ నేతలెందరో దూరంగా ఉండిపోయారు. టిడిపి నేత మండవ వెంకటేశ్వర రావు స్వయంగా పోటీ నుండి తప్పుకున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి
రోశయ్య అనంతరం ముఖ్యమంత్రి అయిన ఖ్యాతి కిరణ్ కుమార్ రెడ్డి విభజన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీకి దూరమయ్యారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. పార్టీ కోసం పదమూడు జిల్లాల్లో ప్రచారం చేయాల్సి ఉన్నందున ఆయన పోటీ నుండి తప్పుకున్నారు. తన స్థానంలో తన సోదరుడిని పోటీ చేయిస్తున్నారు. 1989 నుంచి 2009 దాకా ప్రతి ఎన్నికలోనూ బరిలో నిలిచిన కిరణ్... తన రాజకీయ జీవితంలో తొలిసారిగా ఇలా పోటీ నుంచి పక్కన కూర్చోవాల్సి వచ్చింది.

సబితా ఇంద్రా రెడ్డి
మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి బరి నుండి తప్పుకున్నారు. ఆయితే, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి చేవెళ్ల పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఇంటికి ఒక టికెట్ కారణంగా సబితకు దక్కలేదు.

శంకర రావు
మాజీ మంత్రి శంకర రావుకు ఈసారి కాంగ్రెసు పార్టీ షాక్ ఇచ్చింది. నిత్యం తన వ్యవహార శైలితో వార్తలలో నిలిచే శంకర రావు... టిక్కెట్ రాకపోవడంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైయస్, కిరణ్ రెడ్డిలతో శంకర రావు ఢీకొన్నారు. కొద్ది రోజుల క్రితం కిరణ్తో ఢీకొని మంత్రి పదవి పోగొట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చిన సందర్భంగా ఆయన సోనియాకు గుడి కట్టించినా టిక్కెట్ దక్కలేదు. 1983 నుంచి ఇప్పటిదాకా వరుస విజయాలు నమోదు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ వీడి 2009లో హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్కు వచ్చి గెలిచారు.

కావూరి సాంబశివ రావు
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కావూరి సాంబశివ రావు మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్నారు. కనీసం ఒక్కసారైనా కేంద్ర మంత్రి కావాలనుకున్న ఆయన ఇటీవలె అయ్యారు. కానీ విభజన నేపథ్యంలో కావూరి రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ పడింది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు కావూరి సాహసించలేకపోయారు.

లగడపాటి రాజకీయ సన్యాసం
విభజన నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అన్నమాట ప్రకారం క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీకి సలహాదారుగా ఉన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ది అదే దారి.

ఆనం, వట్టి, కాసు
2009 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి, ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు ద్రువీకరణ పత్రం తీసుకున్నప్పుడే తాను ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత లోకసభకు పోటీ చేయాలని భావించారు. రాష్ట్ర విభజన, తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కూడా ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కాసుకు ఎంపీ, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్లను పార్టీ పిలిచి ఇచ్చినా తాము పోటీ చేయమని చెప్పారు. ఇక రాజకీయాలకు సరదాను కలిపి సందడి చేసే ఆనం వివేకానంద రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. తన బదులు తన కుమారుడిని బరిలో దింపారు.

డిఎల్ రవీంద్రా రెడ్డి
కడప జిల్లా మైదుకూరు నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. విభజన నేపథ్యంలో ఇటీవల ఆయన టిడిపి వైపు చూశారు. ఆ తర్వాత కాంగ్రెసులోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా పోటీకి దూరంగా ఉన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈసారి ఆయన తాడికొండకు బదులు ప్రత్తిపాడు స్థానాన్ని ఆశించారు. కానీ దక్కలేదు. దీంతో ఆయన దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications