పార్టీలకు విరాళాలు: టిడిపి టాప్, తెరాస - జగన్ పార్టీ తక్కువ
తెరాస, టిడిపి ఆదాయం 2014 ఎన్నికల తర్వాత పెరిగింది. తెలియని మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంలో అగ్రస్థానంలో ఉన్న ఐదు ప్రాంతీయ పార్టీల జాబితాలో ఈ రెండు పార్టీలున్నాయి.
హైదరాబాద్: తెలియని వనరుల ద్వారా ఆదాయం పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జాతీయ స్థాయిలో కాంగ్రెసు, బిజెపి అగ్రస్థానంలో నిలిచాయి. ఆ రకంగా విరాళాలు పొందిన ఐదు ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పార్టీ తన గరిష్ట ఆదాయాన్ని రూ.145 కోట్లుగా ప్రకటించింది. ఇందులో రూ.45 కోట్లు తెలియని వనరుల ద్వారా సమకూరింది.
టిడిపితో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆదాయం తక్కువగా సమకూరింది. తెరాస ఆదాయం రూ.35.92 కోట్లు కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆదాయం రూ.23.47 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో తెరాస తెలియని మార్గాల ద్వారా సమకూరిన ఆదాయం ఎక్కువగా ఉంది. ఆ రకంగా తెరాకు సమకూరిన ఆదాయం రూ.25.21 కోట్లు.
తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెరాస, టిడిపిలకు విరాళాలు పెరిగాయి. భారత ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఆదాయం పన్ను రిటర్న్స్ను, వాంగ్మూలాలను ప్రజా హక్కుల సంఘం మంగళవారంనాడు విశ్లేషించింది. రాజకీయ పార్టీలకు అందే ఆదాయంలో ఎక్కువ భాగం తెలియని వనరుల నుంచి సమకూరినట్లు ఆ విశ్లేషణలో తేలింది.

రూ. 20 వేల కన్నా తక్కువ విరాళాలు ఇచ్చే వ్యక్తుల, సంస్థల పేర్లను రాజకీయ పార్టీలు ప్రస్తుతం వెల్లడించాల్సిన అవసరం లేదు. వాటిలో మూడింట రెండు వంతులు ఎక్కడి నుంచి విరాళాలు వచ్చాయనే విషయం తెలియలేదు. నల్లధనాన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఇది చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ పార్టీలు స్వీకరించే విరాళాల్లో 70 శాతం ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియకుండా పోతోంది. గత 11 ఏళ్లలో 2004-05 నుంచి 2014-2015 వరకు కాంగ్రెసుకు వచ్చిన ఆదాయంలో 83 శాతం, అంటే 3,323 కోట్లు, బిజెపికి వచ్చిన ఆదాయంలో 65 శాతం, అంటే రూ.2,125.91 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియడం లేదు.
ప్రాంతీయ వార్టీల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మొత్తం ఆదాయంలో 94 శాతం (రూ.766.27 కోట్లు), శిరోమణి అకాలీదళ్ మొత్తం ఆదాయంలో 86 శాతం (రూ.88.06 కోట్లు) తెలియని వనరుల నుంచి సమకూరింది.












Click it and Unblock the Notifications