ధర్మాన పార్టీ వీడుతారా?: జగన్వైపు అని ప్రచారం

రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ దెబ్బతింటోందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. అంతేకాదు కొందరు కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెసుపై ఆయన వ్యాఖ్యలు, కార్యకర్తలతో సమావేశం నేపథ్యంలో... ఆయన పార్టీ మారేందుకేనన్న ప్రచారం జరుగుతోంది.
అయితే, పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ధర్మాన మాత్రం కొట్టి పారేస్తున్నారు. తనకు పార్టీ మారాలన్న ఉద్దేశ్యమేమీ లేదని చెబుతున్నారు. విభజనపై ముందుకు వెళ్తే సీమాంధ్రలో పార్టీకి మనుగడ ఉండదని, తక్షణం నిర్ణయాన్ని విరమించుకోవాలని తాను అన్నట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ప్రజల నుండి ఒత్తిడి వస్తున్నప్పటికీ విభజన నిర్ణయాన్ని శాసన సభలో వ్యతిరేకించాలనే ఉద్దేశ్యంతోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీని వీడి, ఇతర పార్టీలలోకి చేరుతున్నానన్న ప్రచారం ఊహాజనితమైనదని కొట్టి పారేస్తున్నారు.
తాను సమైక్యాంధ్ర విషయంలో స్థానిక ప్రజల అభిప్రాయాల మేరకే నడచుకుంటానని అన్నారు. పార్టీ మారాలనుకుంటే ఏ కొద్ది మందితో కాకుండా జిల్లా స్థాయిలో కార్యకర్తలతో చర్చించే వాడినని చెప్పారట. అలాంటి ఆలోచనే లేదన్నారట. ప్రజల ఆకాంక్ష మేరకు సమైక్యాంధ్ర కోసం పోరాడతానని చెప్పారు.
కాగా, సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో పలువురు కాంగ్రెసు పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరుతున్న విషయం తెలిసిందే. ధర్మాన కూడా జగన్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం సాగుతున్నప్పటికీ ఆయన మాత్రం కొట్టి పారేస్తున్నారట.












Click it and Unblock the Notifications